ఖైరతాబాద్, జూన్ 3 : తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరి నీ భాగస్వాములను చేస్తూ కొవిడ్ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. సోమాజిగూడలోని ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భవనంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక డ్రైవ్ను ఏర్పాటు చేశారు. ఈ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ 19 నివారణే లక్ష్యంగా ప్రారంభించిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్లు విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. సూపర్ స్ప్రెడర్ల పరిధిలోకి వచ్చే రైతు బజార్లు, కూరగాయలు, పూలు, పండ్లు, మాంసపు, కిరాణ, మద్యం, వీధి దుకాణాలు, కటింగ్ షాపులు, లాండ్రీ, ప్రింటింగ్ ప్రెస్ షాపుల్లో పనిచేసే వారికి వ్యాక్సిన్ ఇస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వనం శ్రీనివాస్ యాదవ్, సలావుద్దీన్, పి. నాగరాజు పాల్గొన్నారు.
ప్రత్యేక కౌంటర్లు….
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా సూపర్స్ప్రెడర్స్ వివరాలను సేకరించిన జీహెచ్ఎంసీ అధికారులు బిల్ కలెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఇంటింటికి వెళ్లి వారి పేర్లను ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. అలాగే నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వచ్చే వారికి కోసం సర్కిల్ 17 జీహెచ్ఎంసీ సిబ్బందితో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.