ఉప్పల్, ఫిబ్రవరి 18 : ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు( Free medical camp) అందించడం అభినం దనీయమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshmareddy) అన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిలుకానగర్లో మల్లారెడ్డి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్, బీఆర్ఎస్పార్టీ యువ నాయకుడు డా.సీహెచ్.భద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యశిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి, తగిన సేవలు అందించాలని సూచించారు. సమాజ శ్రేయస్సులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.
ప్రజలకు అవసరమైన వైద్యసేవల కోసం తనవంతు తోడ్పాటు అందిస్తున్నామని పేర్కొన్నారు. వైద్యసేవలు అందించడానికి ముందుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నాల గీత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, చిలుకానగర్ డివిజన్ అధ్యక్షుడు పల్లె నర్సింగ్రావు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.