మియాపూర్, జూలై 31 : రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గమైన శేరిలింగంపల్లి ఐటీ పరిశ్రమలకు నెలవుగా ఉన్నదని, ఇంతటి గుర్తింపు కలిగిన నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో అభివృద్ధి విషయంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఆదర్శవంతమైన సమగ్రాభివృద్ధి ద్వారా నియోజకవర్గ పేరు ప్రఖ్యాతులు రాష్ట్రంలో మరింత ఇనుమడించేలా తాను చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని గురునాథం చెరువు సమీపంలో రూ. 1.65 కోట్లతో చేపట్టనున్న వరద నీటి కాలువ, మక్తా మహబూబ్ పేట్ సత్యనారాయణ ఎన్క్లేవ్లో రూ. 30 లక్షలతో చేపట్టబోయే మంజీరా తాగునీటి పైపులైన్ పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ సర్కిల్ ఈఈ శ్రీకాంతి, డీఈ రూపాదేవి, జలమండలి డీజీఎం నాగప్రియ, మేనేజర్ సాయిచరిత, పరమేశ్వరి, సునీత సహా పార్టీ నేతలతో కలిసి విప్ అరెకపూడి గాంధీ శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని కాలనీల్లో పూర్తిస్థాయి వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతతో కృషి చేస్తున్నట్లు వివరించారు. మురుగు నీరు, వరద నీటి ప్రవాహాలతో చెరువుల నీరు కలుషితం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. వానకాలం నేపథ్యంలో వరద నీటి కాలువల వల్ల పరిశుభ్రమైన నీటితో చెరువులు కళకళలాడుతాయన్నారు. తాగునీటి పైపులైన్ పనుల ద్వారా ఏండ్ల తరబడి నెలకొన్న తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి గడపకు శుద్ధమైన తాగునీటిని అందించటమే ప్రధాన లక్ష్యమని విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈలు ధీరజ్, అనురాగ్, విశ్వనాథ్, జగదీశ్, పార్టీ నేతలు పురుషోత్తం, మోహన్, గంగాధర్రావు, గోపాల్, కిరణ్యాదవ్, శ్రీనివాస్, మహేందర్, ఖాజా, శ్రీధర్, దయానంద్, రాజేశ్, స్వామి నాయక్, రోజ, సుప్రజ, లత, రాణి, మహాదేవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.