కందుకూరు, జనవరి 4: అది విశాలమైన స్థలంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల. అందులోకి అడుగు పెట్టిన వారు తాము ఏదైనా కార్పొరేట్ బడికి వచ్చామా అని ఆశ్చర్యం వ్యక్తం చేయక మానరు. మీర్ఖాన్పేట్ రెవెన్యూ పరిధిలో ఏర్పాటైన అమెజాన్ వెబ్ సర్వీసు ఇన్ కమ్యూనిటీస్ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్కు ఏ మాత్రం తీసిపోనిరీతిలో సకల వసతులతో అందంగా రూపుదిద్దుకున్నది. 350 మంది విద్యార్థులు ఉన్న మీర్ఖాన్పేట్ జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపుగా రూ. కోటితో పునర్నిర్మాణాలు , మరమ్మతులు చేపట్టారు.
అన్ని తరగతి గదుల్లో విద్యుత్, ఫ్యాన్లు అమర్చారు. గోడలపై రంగు రంగుల బొమ్మలు, మొదటి అంతస్తులో గ్రిల్స్ ఏర్పాటు చేశారు. మైదానంలో ఆట వస్తువులు, తరగతి గదిలో డ్యూయల్ డెస్కులు, బీరువాలు, బల్లలు, కుర్చీలు, గ్రీన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థికి బ్యాగులు అందించారు. మధ్యాహ్నం భోజనానికి ప్రత్యేక షెడ్, తాగునీటి ప్లాంట్, బాలబాలికలకు మరుగుదొడ్లను వేర్వేరుగా నిర్మించారు. అలాగే విద్యార్థులు ఆలోచనలు పంచుకోవడానికి థింక్ బిగ్ ఫేస్ గదిని ప్రారంభించారు. అంతర్జాల వసతులతో 3 ల్యాప్ ట్యాప్లు, కంప్యూటర్లను అందించారు. మెరుగైన వసతులు కల్పించడంతో విద్యార్థులు తల్లితండ్రుల ఆనందాలకు అవధుల్లేవు.
స్కూళ్లను దత్తత తీసుకోవాలి
ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలి. అమెజాన్ డాట్ సెంటర్ మీర్ఖాన్పేట్ పాఠశాలలో అన్ని వసతులు కల్పించడం సంతోషం. సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి ప్రవేశపెట్టి ఆంగ్లంలో విద్యాబోధన ప్రవేశపెడుతున్నాం.
– సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
ఇక్కడే పనిచేయాలనిపిస్తోంది
అమెజాన్ డాట్ సెంటర్ వారు కల్పించిన వసతులతో పాఠశాలకు రాగానే సమస్యలన్నింటినీ మర్చిపోతాం. విద్యార్థులు చదువుకోవడానికి, ఆడుకోవడానికి ఏలాంటి లోటు పాట్లు లేవు. నేను కొత్తగా వచ్చినప్పడు స్కూల్లో వసతులు లేక ఇబ్బంది పడ్డా. ఇప్పుడు అన్ని వసతులు ఉండడంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇక్కడే పని చేయాలనిపిస్తోంది.
– శ్రీధర్, హెచ్ఎం,మీర్ఖాన్పేట్ జడ్పీహెచ్ఎస్
అమెజాన్ డాట్ కంపెనీ వారు మా ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పించారు. చదువుతో పాటు ఆటలకు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అన్నీ సమకూర్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, అమెజాన్ కంపెనీ వారికి కృతజ్ఞతలు.