సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : చారిత్రక మీరాలం చెరువులోకి చుక్కా మురుగునీరు చేరకుండా జలమండలి పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే ఎస్టీపీ ప్రాజెక్టు ప్యాకేజీ -2లో 41.5 ఎంఎల్డీ సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నది. తుది దశలో ఉన్న ఎస్టీపీ నిర్మాణ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మీరాలం ట్యాంక్ సుందరీకరణ పనులు చేపడుతున్న తరుణంలో చెరువులోకి అక్కడకక్కడ నుంచి మురుగునీరు వచ్చి చేరుతున్నదని, తక్షణమే పైపులైన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఇటీవల పర్యటనలో ఎండీ దానకిశోర్ గుర్తించారు.
వెంటనే పైపులైన్ అనుసంధాన పనులు చేపట్టాలని అధికారులను ఎండీ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు 1650 ఎంఎం డయా ఎంఎస్ పైపులైన్ పనులకు రూ. 64.34 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి.. టెండర్లను ఆహ్వానించారు. ఈ నెల 31 వరకు గడువు విధించారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ పైపులైన్ పనులు చేపట్టి మురుగు నుంచి శాశ్వత విముక్తి కల్పించనున్నారు.