హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ లైంగికదాడి కేసులో నిందితులుగా ఉన్న మైనర్లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను జువైనల్ జస్టిస్ కోర్టు బుధవారం తిరస్కరించింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులకు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
కేసులో ఉన్న ఆరుగురు నిందితుల్లో ఒకరు మేజర్ కాగా, మిగిలిన ఐదుగురు మైనర్లే. ఐదుగురిలో నలుగురు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. అయితే నలుగురు మైనర్లు సమాజంలో పలుకుబడి కలిగిన వారి పిల్లలేనని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు దశలో ఉన్న సమయంలో వీరికి బెయిల్ ఇస్తే… బాధితులతో పాటు సాక్షులను కూడా నిందితుల కుటుంబాలు ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న జువెనైల్ జస్టిస్ బోర్డు… నిందితులకు బెయిల్ నిరాకరిస్తూ వారి పిటిషన్లను కొట్టేసింది. ఇదిలా ఉంటే… ఐదో మైనర్ కూడా రేపు (గురువారం) జువెనైల్ జస్టిస్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం.