మారేడ్పల్లి, జూన్ 14: సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య, ఆరోగ్య దినోత్సవాన్ని సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, వైద్య అధికారుల సేవలతో తెలంగాణ ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు.
పేదల చెంతకే వైద్య సేవలు తీసుకువెళ్లే విధంగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో 2014కు ముందు రూ.2026 కోట్లు వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్ ఉండగా ఇప్పుడు రూ.12,600 కోట్లు కేటాయించారని, నాడు కేవలం 4 మెడికల్ కాలేజీలు ఉండగా ఇప్పుడు జిల్లాకు ఒకటి చొప్పున 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి ఎంబీబీఎస్, పీజీ సీట్లు పెంచుకోగలిగామని అన్నారు. నిమ్స్లో కేవలం 900 పడకలు ఉండగా ఈరోజు సీఎం కేసీఆర్ 2000 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన గర్భిణులకు అందించే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని ప్రారంభించి వాటిని గర్భిణులకు అందజేశారు.
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జె.వెంకటి 2014 నుంచి 2023 వరకు జరిగిన అభివృద్ధి, మార్పులపై నివేదిక అందించారు. ఇప్పటి వరకు 161 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయగా మరో 7 త్వరలో ప్రారంభించబోతున్నామని, పేదలకు 158 రకాల మందులు, 57 రకాల ల్యాబ్ టెస్టులు ఉచితంగా చేస్తున్నామని చెప్పారు. అత్యంత ఖరీదైన మరో 134 ల్యాబ్ టెస్టులు త్వరలో అందుబాటులోకి రానున్నాయని, స్పెషలిస్టు వైద్యులతో టెలీమెడిసిన్ ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కె.మహేశ్వరీ, హేమలత, గాంధీ ఆసుపత్రి ఆర్ఎంఓ జయకృష్ణ, ఎస్పీహెచ్ఓ రాజశ్రీ, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించారు.