బేగంపేట్ డిసెంబర్ 28: పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. బుధవారం రాంగోపాల్పేట్ డివిజన్లోని కాచ్బౌలి నాలాలో పూడిక తొలగింపు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ నాలా పరిసర ప్రాంతాల ప్రజలు చెత్త, ఇతర వ్యర్థాలను నాలాలో వేయడం వలన నీరు సక్రమంగా వెళ్లడం లేదని దీంతో దుర్వాసన, దోమలు పెరిగిపోయి రోగాల బారిన పడుతున్నట్లు వివరించారు. నాలాలో చెత్తను వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కాచ్బౌలి నాలా వెంట గోడ శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉందని స్థానిక మహిళలు మంత్రి దృష్టికి తీసుకురాగా ఆ ప్రాంతాన్ని పరిశీలించి గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదే విధంగా తమ కాలనీలో వాటర్ సీవరేజీ సమస్యను పరిష్కరించాలని కోరగా వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు. కమిటీ హాల్ నిర్మాణానికి కూడా వారం రోజులలో ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు. నాలా పూడిక తీత పనులు ప్రహరీ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్టు మంత్రి తెలిపారు. ఆయన వెంట మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఈఈ సుదర్శన్, జలమండలి జీఎం రమణారెడ్డి, బస్తీ వాసులు నర్సింగ్రావు, భగత్సింగ్, ప్రశాంత్, వినోద్, జగ్గు, కిశోర్, సత్యనారాయణ, శివయ్య తదితరులు ఉన్నారు.
బేగంపేట్ డిసెంబర్ 28: ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ బేగంపేట్ డివిజన్ పాటిగడ్డలో పర్యటించిన సందర్భంగా గర్భిణులు ప్రసవాల కోసం సుదూర ప్రాంతాల్లోని దవాఖానలకు వెళ్లాల్సి వస్తుందని ఇక్కడే 20 బెడ్ల దవాఖానను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. స్పందించిన ఆయన అవసరమైన ప్రతిపాదనలు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
దీంతో బుధవారం వెస్ట్ మారేడ్పల్లిలోని నివాసంలో జిల్లా వైద్యాధికారి వెంకట్ ఆధ్వర్యంలో టీఎస్ ఎంఐడీసీ ఎస్ఈ సురేందర్రెడ్డి, ఇతర అధికారులు మంత్రిని కలిసి నూతన దవాఖాన భవనానికి సంబంధించిన నమూనాను మంత్రికి వివరించారు. భవన నిర్మాణానికి రూ. ఆరు కోట్లు ఖర్చవుతాయని మంత్రికి వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరుకు కృష్టి చేస్తానని మంత్రి తెలిపారు. పాటిగడ్డ ప్రాంతంలో అత్యధికంగా పేద ప్రజలు నివసిస్తున్నారని వైద్యం కోసం ప్రైవేట్ దవాఖానకు వెళ్లి ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని ఈ దవాఖాన ఏర్పాటు తో ఎంతో మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు.
బన్సీలాల్పేట్, డిసెంబర్ 28 : నియోజకవర్గంలోని పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పద్మారావునగర్లో రూ.18 లక్షల వ్యయంతో సమోసా పార్కు, వెంకటాపురం కాలనీలో రూ.18 లక్షలతో అభివృద్ధి చేసిన నూతన పార్కులను బుధవారం కార్పొరేటర్ హేమలత, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, పద్మారావునగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి పవన్కుమార్ గౌడ్లతో కలసి ప్రారంభించారు.
అనంతరం బోయిగూడలోని అల్ఫతా హోటల్ వద్ద రూ.9.65 లక్షలు, బర్ల బాలయ్య దొడ్డి వద్ద రూ.15 లక్షలు, బోయిగూడలో రూ.9.5 లక్షలు, రైల్వే బ్రిడ్జి వెనుక వీధిలో రూ.9.80 లక్షలు, భోలక్పూర్లో రూ.9.85 లక్షలతో కొత్తగా ఏర్పాటు చేయనున్న సీవరేజీ పైప్లైన్ పనులను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ వెంకటాపురం కాలనీలో శిథిలావస్థకు చేరిన కమ్యూనిటీ హాలు స్థానంలో నూతన భవనం నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో బేగంపేట్ సర్కిల్ డీసీ ముకుందరెడ్డి, ఈఈ సుదర్శన్, హార్టికల్చర్ అధికారి రాఘవేందర్, జలమండలి జీఎం రమణారెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, నాయకులు లక్ష్మిపతి, ఏసూరి మహేశ్, నాయకులు పాల్గొన్నారు.