అమీర్పేట్, డిసెంబర్ 30 : సనత్నగర్ సుభాశ్నగర్లో శిథిలావస్థకు చేరిన ఈదమ్మ, మైసమ్మ అమ్మవార్ల ఆలయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తన సొంత నిధులతో పునర్నిర్మాణ పనులు జరిపిస్తున్నారు. ఆలయాల నిర్మాణ వ్యవహారాల్లో నిపుణులైన జయరాం పర్యవేక్షణలో ఈ నిర్మాణ పనులు సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం మంత్రి తలసాని ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. మరో మూడు నెలల్లో పనులు పూర్తవుతాయని తెలపడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దేవాలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక విలువలున్న మంత్రి తలసాని ఈదమ్మ మైసమ్మ అమ్మవార్ల దేవాలయాన్ని దగ్గరుండి పునర్నిర్మాణ పనులు జరిపిస్తుండడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఇటీవల బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం ఎదుట దాతలకు కూడా అవకాశాన్ని కల్పిస్తూ జరిపిన షెడ్డు నిర్మాణాలతో ఆలయ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, దీంతో ఆలయ వైభవం నలు దిశలా విస్తరించిందన్నారు.
నియోజకవర్గంలో మంత్రి తలసాని అడుగు పెట్టిన తరువాత ఆలయాలు మరింతగా అభివృద్ధి చెందాయని, మెరుగైన వసతులు అందుబాటులోకి రావడంతో భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ భారతమ్మ, ప్రవీణ్కుమార్ గౌడ్, అనిల్, సాయి ముదిరాజ్, మల్లికార్జున్ గౌడ్తో పాటు బీఆర్ఎస్ నాయకులు కొలను బాల్రెడ్డి, ఫాజిల్, రాజేశ్ ముదిరాజ్, సురేశ్ గౌడ్, ఖలీల్ బేగ్, జమీర్బేగ్, ప్రియవర్ధన్, పురుషోత్తమ్, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బేగంపేట్, డిసెంబర్ 30 : రాణిగంజ్ నుంచి నెక్లెస్ రోడ్డు వెళ్లే దారిని రాణిగంజ్ డిపో అధికారులు గురువారం మూసి వేసే ప్రయత్నం చేశారు. ఎంతో కాలంగా వినియోగంలో ఉన్న దారిని రాణిగంజ్ ఆర్టీసీ అధికారులు తమదిగా పేర్కొంటూ గురువారం గోడ నిర్మాణ చర్యలకు ఉపక్రమించారు. అయితే ఈ దారిని మూసేస్తే నెక్లెస్ రోడ్డు, రాణిగంజ్, అంబేద్కర్నగర్, కస్తూర్బానగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. దీంతో అప్రమత్తమైన స్థానికులు విషయాన్ని వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దృష్టికి తీసుకువెళ్లారు.
వెంటనే స్పందించిన మంత్రి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి గోడ నిర్మాణం వల్ల తలెత్తే ఇబ్బందులను వివరించడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో శుక్రవారం ఉదయం రాణిగంజ్, అంబేద్కర్నగర్ తదితర ప్రాంతాలకు చెందిన హిమాన్షు, దేవరాజ్, గణేశ్, మిధున్, రాజేందర్ జైన్, షరీఫ్ తదితరులు మంత్రి తలసానిని మారేడ్పల్లిలోని ఆయన నివాసంలో కలిసి తమ సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
బన్సీలాల్పేట్, డిసెంబర్ 30 : రామ్నాథ్ ముదిరాజ్ మూవీస్ నిర్మిస్తున్న ‘రెంట్’ (నాట్ ఫర్ సేల్) సినిమా పోస్టర్ను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శుక్రవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ను మంత్రి అభినందిస్తూ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు శివారెడ్డి, అమిత్ తివారిలతో పాటు దర్శకులు రఘువర్దన్ రెడ్డి, నిర్మాతలు రామ్నాథ్ ముదిరాజ్, జగదీశ్, సహ నిర్మాత మిట్టపల్లి జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు.