హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో 66 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి అండగా నిలవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఈ పథకాలు అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, ఉప్పల తరుణి, తదితరులు పాల్గొన్నారు.