‘గ్రేటర్ హైదరాబాద్ను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. పట్టణాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో కళకళలాడుతూ ఉండాలన్నదే పట్టణ ప్రగతి కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. నగరంలో మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది.’– తలసాని శ్రీనివాస్యాదవ్, మంత్రి
సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గురువారం నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ పరిధిలో 955 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, పారిశుధ్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, హరితహారం కార్యక్రమాలను పకడ్బందీగా చేపడుతామన్నారు. యజ్ఞంలా నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమం గురించి మంత్రి తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే…
వార్డుల వారీగా అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష, సీజనల్ వ్యాధుల నివారణ కోసం పారిశుధ్య కార్యక్రమాలు, నీటి నిల్వల తొలగింపు, దోమల నివారణకు మందుల స్ప్రేయింగ్, చెత్త, రహదారుల వెంట పిచ్చి మొక్కలు, రోడ్ల వెంట భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు, శిథిల భవనాల కూల్చివేత, ఖాళీ స్థలాల్లో హరితహారం మొక్కల పెంపకం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లకు స్థల సేకరణ తదితర కార్యక్రమాలను పక్కాగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ ఒక్కటే మార్గం.
పట్టణ ప్రగతిలో పారిశుధ్యంతో పాటు పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నాం. గడిచిన ఐదేండ్లలో మొక్కలు నాటిన ప్రాంతాలను పరిశీలించడం, చెట్లు పెరగడానికి అడ్డంకిగా ఉన్న వాటి తొలగింపు, చెట్ల చుట్టూ మట్టిని సరిచేయడం, వీడింగ్, ట్రీ గార్డులను ఏర్పాటు చేయనున్నాం. కాలనీ ప్రాంతాల్లోని పార్కులను సందర్శించి అక్కడ శుభ్రత చర్యలు తీసుకుంటాం. ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటడం, అన్ని నర్సరీల్లో 100 శాతం మొక్కలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. పట్టణ ప్రకృతి వనాల కింద ట్రీ పార్కులను ఏర్పాటు చేస్తాం.
ముఖ్యమంత్రి దార్శనికత హరిత విప్లవాన్ని తలపిస్తోంది. గ్రీన్ కవరేజ్ను 33 శాతం పెంచాలనే ఆశయంతో ప్రారంభించిన తెలంగాణకు హరితహారంలో 2016 నుంచి 2020 వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 2.77 కోట్ల మొక్కలను నాటడం, ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. 2021లో హరితహారంలో భాగంగా కోటిన్నర మొక్కలను నాటాలనే లక్ష్యాన్ని నిర్ణయించింది. ఇందుకోసం ఆరు జోన్లలోని 600 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశాం. హెచ్ఎండీఏ పరిధిలో 34 నర్సరీలో 3.5 కోట్ల మొక్కలను సిద్ధం చేయగా, కోటికి పైగా మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేశాం.
పట్టణ ప్రగతిలో చెత్త, వ్యర్థాలను తొలగించడం, డ్రైనేజీలను శుభ్రపర్చడం, దోమల నివారణకు ఫాగింగ్, హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు వారివారి ప్రాంతాల్లో జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలి. సీఎం కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలి.