బంజారాహిల్స్,జూన్ 15: హైదరాబాద్ నగరంలోని నాలాల్లోని ఆక్రమణల తొలగింపు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. నాలాల్లో పూడికతీత పనుల పురోగతిని పరిశీలించేందుకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా రెండో రోజు బంజారాహిల్స్ రోడ్ నంబర్- 1లోని బల్కాపూర్ నాలాను స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, జోనల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. సుమారు 1.65 కి.మీ పొడవైన బల్కాపూర్ నాలాలో పూడిక తొలగింపు కోసం రూ.70 లక్షలు మంజూరు చేశామన్నారు. సుమారు 80 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెన్షన్ ఆఫీసువద్ద అక్రమ నిర్మాణం వల్ల వరదనీరు నిలిచిపోతున్నదని స్థానికులు మంత్రి తలసానికి ఫిర్యాదు చేయగా, తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అహ్మద్ సర్ఫరాజ్, డీసీ ఇంతేషాఫ్ అలీ పాల్గొన్నారు.
అమీర్పేట్: బాపూనగర్ స్థల పరిరక్షణకు మంత్రి తలసాని చర్యలకు ఉపక్రమించారు. మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకమారితో పాటు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, యూఎల్సీ, హౌసింగ్ బోర్డు, రిజిస్ట్రేషన్ విభాగాల అధికారులతో కలిసి మంగళవారం సందర్శించారు. బస్తీవాసుల సమక్షంలో వివాదాస్పద స్థలానికి సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హౌసింగ్ బోర్డు అధికారులు స్థల సేకరణకు సంబంధించి 1962 నుంచి తమ వద్ద ఉన్న ఆధారాలతో ఇది ఖచ్చితంగా బోర్డుకు చెందిన స్థలమేనని మంత్రి తలసాని వద్ద స్పష్టం చేశారు. అయితే ఇదే విషయమై కోర్టులో కొనసాగుతున్న కేసుల్లో ఇంప్లీడ్ కావాలంటూ మంత్రి ఆదేశించారు.
గతంలోనే ఈ స్థలాన్ని గెజిట్ చేసి నోటిఫై చేసిన విషయాన్ని కూడా కప్పిపుచ్చేందుకు తప్పుడు పత్రాలను సృష్టించిన వారిని, ఇందుకు సహకరించిన వారిని కూడా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈనెల 21 నుంచి అధికారులు ఈ స్థలానికి సంబంధించి సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదికను అందిస్తారని, బస్తీ వాసులు సహకరించాలని కోరారు. ఈ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు జరుగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యటనలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ప్రావీణ్య, ఆర్డీవో వసంత, హౌసింగ్ బోర్డు సీఈ శ్రీనివాస్, ఈఈ రాధాకృష్ణ, డీసీ వంశీ, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ (టీహెచ్బీ) వెంకటేశ్వర్లు, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ (కలెక్టరేట్) శ్రీనివాస్, యూఎల్సీ అధికారిణి కుమారి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రమేశ్, ఎస్ఆర్వో సింధు తదితరులు పాల్గొన్నారు.