కంటోన్మెంట్, మార్చి 5 : దివంగత ఎమ్మెల్యే సాయన్న సేవలు మరువలేనివని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి అన్నారు. ఆదివారం కంటోన్మెంట్ రసూల్పురాలోని సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయం వద్ద బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన దివంగత ఎమ్మెల్యే సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయన్న 72వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఎంతో ఘనంగా సాయన్న జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన సమయంలో ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవడం బాధాకరం అన్నారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా 5 పర్యాయాలు పనిచేసిన సాయన్న నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారంతో పాటు నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. భౌతికంగా సాయన్న మన మధ్య లేకపోయినా ఎప్పుడూ మన మనస్సులోనే ఉంటారని అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి పాల్గొని సాయన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్, సాయన్న కుమార్తెలు నివేదిత, నమ్రత, బోయిన్ పల్లి మార్కెట్ చైర్మన్ హారిక ఆనంద్, మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, ప్రభాకర్, నలినికిరణ్, శ్యామ్కుమార్, డబుల్ బెడ్ రూం ఇండ్ల కమిటీ సభ్యులు బాల్రాజ్, రఫిక్, నరేశ్, అజామ్, తౌఫిక్, రపూఫ్, గౌస్, నాజర్, రషీద్, నర్సింహ, జాఫర్, ఆహ్మద్, శ్రీనుగౌడ్, సునీల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.