హైదరాబాద్ : సికింద్రాబాద్ మహాంకాళీ బోనాల జాతరకు ప్రభుత్వం తరుఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) వెల్లడించారు. సికింద్రాబాద్ మహాంకాళీ ఆలయం వద్ద వచ్చే నెల 9,10వ తేదీల్లో నిర్వహించనున్న బోనాల ఉత్సవాల సందర్భంగా అధికారులు, స్థానికులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు.
బోనాలజాతరకు లక్షలాధి మంది భక్తులు వచ్చే అవకాశముందని అన్నారు. ఇందుకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఏట ఆషాఢమాసంలో నిర్వహించే బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని 60 సంవత్సరాలుగా ప్రజల నుంచి ఉన్న డిమాండ్ అని అన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారని తెలిపారు.
ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం పండుగ నిర్వహణకు రూ.15 కోట్లను మంజూరు చేసిందన్నారు. ప్రైవేట్ ఆలయాల నిర్వహకులు కూడా ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిధులు అందజేస్తుందని వివరించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా పలు స్వచ్ఛంద సేవా సంస్థలు దక్కన్ మానవసేవా సమితి, ఆర్యసమాజ్,స్క్వౌట్స్ అండ్ గ్రైడ్స్ సభ్యులు సేవలను అందించనున్నారని తెలిపారు.