హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ.. వైద్య రంగంలో ఆశ వర్కర్లు(Asha workers), గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంరక్షణ లో అంగన్వాడీ టీచర్లు(Anganwadi) అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాలు, స్థానిక సంస్థలు, చట్ట సభలలో మహిళలకు అవకాశాలు కల్పిస్తూ వారి హక్కులను కాపాడుతున్నట్లు చెప్పారు. తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు, పాలు, బాలామృతం వంటి పౌష్టికాహారం అందిస్తుందన్నారు.
రాష్ట్రం ఏర్పాటు తర్వాత అంగన్ వాడీల వేతనాన్ని మూడువందల శాతానికి పెంచిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్ట్ అధికారి సునంద, నోడల్ అధికారి రాజేందర్, కార్పొరేటర్ దీపిక, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, డీసీ ముకుంద రెడ్డి, సఖి కేంద్రం అధికారి అనితా రెడ్డి, యూసీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ నీరజ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.