మహేశ్వరం, జూన్ 7 : తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే ఒక మైలు రాయిగా నిలిచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలో నిర్వహించిన నీటి దినోత్సవంలో శాసన మండలి సభ్యులు బి.దయానంద్ గుప్తతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగు, తాగు నీటిని అందిస్తామని అన్నారు. కృష్ణా బ్యాక్ వాటర్తో ఈ ప్రాజెక్టును చేపట్టాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. అటు న్యాయ పోరాటం చేస్తూనే.. ప్రాజెక్టును ముందుకు నడిపిస్తున్నామని తెలిపారు. గోదావరిలో 32 టీఎంసీలు, కృష్ణాలో 23 టీఎంసీల నీటితో ఆయా ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మించి రాష్ట్ర ప్రజలకు తాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. కృష్ణా జలాలతో రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. గతంలో మన జిల్లాలో చెక్ డ్యాంలు నిషేధం ఉండగా.. సీఎం కేసీఆర్ చెక్ డ్యాంలు కట్టడానికి అనుమతి ఇవ్వడంతో అనేక చెక్డ్యాంలు నిర్మించి నీటి నిల్వలను పెంచామని తెలిపారు.
సీఎం కేసీఆర్ది.. ప్రజలు మెచ్చిన పాలన
నాడు 40 లక్షలు, నేడు 3కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికారంలోకి వచ్చిన మూడేండ్ల కాలంలోనే సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. 2014కు ముందు రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండితే నేడు 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండుతుందని అన్నారు. మన రాష్ట్రం వరి ధాన్యాన్ని పండించడంలో పంజాబ్ రాష్ట్రాన్ని మించి పోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జంగారెడ్డి, ఆర్డీవో సూరజ్కుమార్, సూపరింటెండెంట్ ఇంజినీర్ హైదర్ఖాన్, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునితా ఆంధ్యానాయక్, తదితరులు పాల్గొన్నారు.