పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ దేశ ప్రజలను రోడ్డున పడేస్తున్నందుకా.? పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటేల పెంచి వాహనదారులకు కన్నీళ్లు పెట్టిస్తున్నందుకా..? వంట గ్యాస్ ధర విపరీతంగా పెంచి పేదల నడ్డివిరుస్తున్నందుకా.. అని మండిపడ్డారు. దేశంలో బీజేపీ 21 రాష్ర్టాల్లో పాలిస్తున్నదని తెలంగాణలో ఉన్న పథకాలు వారు పాలించే రాష్ర్టాల్లో ఎక్కడైనా ఉన్నాయా.. తెలంగాణలో ఇచ్చినన్ని ఉద్యోగాలు ఎక్కడైనా ఇచ్చారా.. చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ప్రజలను ఓట్లు అడిగే హక్కే లేదన్నారు.
కందుకూరు, మార్చి 6 : ఉద్యోగులు, పట్టభద్రులు ప్రతి పక్షాల మోసపూరిత మాటలు నమ్మవద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవికి మద్దతుగా శనివారం మండల పరిధిలోని ఆకులమైలారం గ్రామంలో మంత్రి ప్రచారం నిర్వహించారు. విద్యావంతురాలు వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ గౌర కళమ్మ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పదేండ్ల పాలనలో 85వేల ఉద్యోగాలు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ పాలనలో లక్షా 32వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. బీజేపీ దేశ వ్యాప్తంగా 21రాష్ర్టాల్లో అధికారంలో ఉందని అక్కడ ఉద్యోగాల కల్పనతోపాటు రైతులకు అమలు చేస్తున్న పథకాల గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రైవేట్పరం చేస్తూ ప్రజలకు ఉద్యోగాలే రాకుండా చేస్తున్నదని తెలిపారు. బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు ఏనాడు ప్రజల గురించి పట్టించుకోలేదని, గడిచిన ఐదేండ్లలో ఆయన ఎమ్మెల్సీగా ఏం చేశారో చెప్పాలన్నారు. ఆయన ప్రశ్నించే గొంతైతే.., వాణీదేవి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే గొంతు అని.. అన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేది సీఎం కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి పేదల నడ్డి విరుస్తుందని తెలిపారు. అలాంటి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.
బీజేపీ వైఫల్యాలను ఎండగట్టాలని ప్రజలకు, విద్యావంతులకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల ఏకీకృత రూల్స్ హైకోర్టులో ఉన్నందున సమస్య పరిష్కరించడంలో కొంత జాప్యం జరుగుతుందని, మిగిలిన సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ అన్నపూర్ణ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, డైరెక్టర్లు ఆనంద్, పారిజాతం, ప్రకాశ్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు సామ మహేందర్రెడ్డి, మేఘనాథ్రెడ్డి, చిర్ర సాయిలు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహా రెడ్డి, దామోదర్గౌడ్, సామయ్య, ఈశ్వర్గౌడ్, అశోక్ముదిరాజ్, సత్యనారాయణ, అంజయ్య, ఎర్రబైరు పుల్లారెడ్డి, కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్రెడ్డి, ప్రశాంత్చారి, మూల హన్మంత్రెడ్డి, నందీశ్వర్, మోహన్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.