బడంగ్పేట/కందుకూరు/ఆర్కేపురం/మహేశ్వరం నవంబర్9: మహేశ్వరం నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని..మరోసారి ఆశీర్వదించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గురువారం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో మంత్రి గడప గడపకు తిరిగి ప్రచారం చేశారు. మంత్రికి కాలనీ వాసులు నీరాజనాలు పలికారు. అమ్మ నీకే ఓట్లు వేస్తామని వృద్ధులు సైతం సబితమ్మకు భరోసా ఇచ్చారు. కారు గుర్తుకు తప్పకుండా ఓట్లు వేస్తామని హామీ ఇచ్చారు. మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌ హాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు రాజేందర్ రెడ్డి, నవీన్ గౌడ్, భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.
బడంగ్పేట, నవంబర్9: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేయనున్నారు. ఉదయం 9 గంటలకు కర్మన్ఘాట్ అంజనేయ స్వామి దేవాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలతో దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. పూజల అనంతరం బైక్ ర్యాలీలతో కర్మన్ఘాట్ నుంచి బాలాపూర్ చౌరస్తా, శివాజీ చౌక్, పహాడీషరీఫ్, తుక్కుగూడ సర్కిల్, మహేశ్వరం గేట్, సిరిగిరి పురం గేటు మీదుగా మహేశ్వరం తాసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. నామినేషన్ అనంతరం మహేశ్వరంలో నిర్వహించే బహిరంగ సభలో మంత్రి పాల్గొంటారు. అభివృద్ధిని ఆకాంక్షించే వారందరూ తనతో వస్తారని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, అభిమానులు స్వచ్ఛందంగా రావాలని కోరారు.