కమిటీ ప్రధానంగా ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల సంక్షేమం, వాహనాల ఫిట్నెస్, పర్మిట్, బీమా, భద్రతా ప్రమాణాలు, అగ్రిగేటర్ల రిజిస్ట్రేషన్, అనుమతులు, నియంత్రణ వ్యవస్థ, డిజిటల్ మానిటరింగ్, ఛార్జీలలో పారదర్శకత, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, మహిళా ప్రయాణికులు, మహిళా డ్రైవర్ల భద్రత, వాహనాల పర్యవేక్షణ, ప్రభుత్వ శాఖలతో డేటా సమన్వయం, అలాగే ఎలక్ట్రిక్ మరియు పర్యావరణహిత వాహనాల ప్రోత్సాహం వంటి కీలక అంశాలను పరిశీలించిందని మంత్రి వివరించారు. ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల సంక్షేమం, చట్టబద్ధమైన సేవలు, సాంకేతికత వినియోగం, పర్యావరణ పరిరక్షణ ,వ్యాపార సౌలభ్యం మధ్య సమతుల్యత సాధించేలా ఈ పాలసీ రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
ప్రస్తుతం కమిటీ తన సిఫారసులను తుది రూపంలో సిద్ధం చేస్తోందని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. నివేదిక అందిన అనంతరం ప్రభుత్వం సిఫారసులను సమగ్రంగా పరిశీలించి, నిర్దేశిత విధాన ప్రక్రియ ప్రకారం తెలంగాణ మోటార్ వాహన అగ్రిగేటర్ పాలసీని అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపడుతుందని మంత్రి పేర్కొన్నారు.