కవాడిగూడ, ఫిబ్రవరి 19: సమాజాన్ని ప్రభావితం చేసేది రచయితలేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈతరం సెల్ఫోన్లు, యూ ట్యూబ్లలో మునిగితేలుతున్నదని, వాటి నుంచి బయటపడాలంటే పుస్తక పఠనమే అందుకు సరైన మార్గమన్నారు. ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ సోమవారం రాత్రి ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన ముగింపు సభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తొలుత 10 ఏండ్ల నుంచి నిర్వహించిన బుక్ ఫెయిర్ ప్రస్థానానికి సంబంధించిన ‘పుస్తకాల పండుగ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ సమాజంలోని విభిన్న అంతరాలు, అసమానతలు పోవాలంటే పుస్తకాలు ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతాయన్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలురు గౌరీశంకర్ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివారెడ్డి, ప్రొఫెసర్ రమామెల్కోటే, ఓయూ వీసీ డి. రవీందర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, బుక్ ఫెయిర్ కార్యదర్శి ఆర్, వాసు, ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, కోయ చంద్రమోహన్, కోశాధికారి పి. రాజేశ్వర్ రావు, బుక్ ఫెయిర్ వ్యవస్థాపక అధ్యక్షుడు శృతికాంత్ భారతి, శోభన్ బాబు, జనార్దన్గుప్తా, సూరిబాబు, బాల్ రెడ్డి, కవి యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.