బోడుప్పల్, మార్చి 6 : మత విద్వేశాలను రెచ్చగొడుతూ.. అబద్దాల పునాధులమీద బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రతి గడపకు వెళ్లాలి.. ప్రతి ఒక్క పట్టభద్రుడిని కలువాలి.. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలి.. టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికి ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ.. వాణీదేవికి మొదటిప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించేలా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శనివారం బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులతో నిర్వహించిన సన్నాహక సమావేశానికి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్రెడ్డితో కలిసి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి పట్టభద్రులు ఎందుకు ఓటు వేయాలో కార్యకర్తలు వివరంగా తెలుపాలన్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడటం తప్పితే.. ఆరేండ్ల కాలంలో బీజేపీ చేసిందేమీలేదన్నారు. కుల, మత, ప్రాంత తేడాల్లేకుండా పారదర్శక పాలన అందజేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వానికి పట్టభద్రుల నుంచి సంపూర్ణ మద్దతు పొందేందుకు ఇన్చార్జిలు కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, బోడుప్పల్ ఎన్నికల ఇన్చార్జి ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.