శామీర్పేట, నవంబర్ 6 : సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంపదను పెంచి, పేదలకు పంచుతున్నడని మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలోని తూంకుంట మున్సిపాలిటీలోని తూంకుంట, దేవరయాంజాల్లో సోమవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అంటేనే ఒక చరిత్ర అని, దేశ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు అందజేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రతి ఇంటికి ఏదో రూపంలో సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలకు చేసిందేమిలేదని విమర్శించారు. ప్రజలను ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందని మంత్రి అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం మేలు జరిగిందని ప్రశ్నించారు. నీళ్లు లేవు, కరెంటు లేదు.. ప్రజల గోడు పట్టించుకున్న నాధుడే లేడన్నారు.
నడమంత్రపు సిరి ఎక్కువ రోజులు ఉండదని ప్రజలందరికి తెలుసనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తల్లిదండ్రులు పెట్టిన పేరును మార్చుకున్న తోటకూర జంగయ్య.. పైసలు బాగా సంపాదించి వజ్రేశ్యాదవ్గా పేరు మార్చుకున్నాడని తెలిపారు. పైసలు రాంగనే తల్లిదండ్రులు పెట్టిన పేరును మార్చుకున్న ఆయన వైఖరి ఎట్లుంటదో ప్రజలే ఆలోచించాలన్నారు. మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ ఏనాడు ప్రజలను పట్టించుకోలేదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తాపత్రయం తనకు ఉన్నదని, మరోసారి ఆశీర్వదించాలని మంత్రి ప్రజలను కోరారు.