కాచిగూడ, సెప్టెంబర్ 22: కరాటే నేర్చుకోవడం శారీరకంగా, మానసికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఇటీవల అహ్మదాబాద్లో జైళ్లశాఖ 6వ జాతీయ కరాటే పోటీలు నిర్వహించారు. 68 మంది జైళ్లశాఖ ఉద్యోగులు వివిధ క్రీడాల్లో పాల్గొని 6 బంగారు పతకాలు, 1 రజితం, 2 కాంస్య పతకాలతో పాటు 4 ట్రోఫీలను సాధించారు. ఈ సందర్భంగా హోంమంత్రి గురువారం కరాటే పోటీల్లో గెలుపొందిన జైళ్లశాఖ ఉద్యోగులను అభినందించి, సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసికంగా, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతాయని తెలిపారు. ఆత్మరక్షణకు కరాటే ఒక ఆయుధంగా పనిచేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జైళ్లశాఖ డీజీ డాక్టర్ జితేందర్, ఐజీ రాజేశ్, హైదరాబాద్ రేంజ్ డీఐజీ ఎం.మురళీబాబు, వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ డి.శ్రీనివాస్, వరంగల్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎం.సంపత్, సంగారెడ్డి జిల్లా జైలు సూపరింటెండెంట్ భరత్రెడ్డి, చంచల్గూడ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ కాళిదాస్, మహబుబ్నగర్ జిల్లా జైలు సూపరింటెండెంట్ వెంకటేశం, శ్రీమాన్రెడ్డి, రామయ్య, జీవీఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ జీఎస్. గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.