ప్రాజెక్టు విశేషాలు
వంతెన పై వంతెన చూస్తుంటే.. అద్భుతంగా ఉంది కదూ.. గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదుగా నిర్మించిన శిల్పా లేవుట్ పై వంతెన ఇది. రూ.466 కోట్ల వ్యయంతో 1.75 కిలోమీటర్ల పొడవుతో దీనిని నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సమగ్రమైన అభివృద్ధి వ్యూహంతో నగరం నలు దిశల విస్తరిస్తున్న వేళ.. ఎస్ఆర్డీపీలో వడివడిగా సిద్ధమైన 17వ వంతెన ఇది. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్య మరింత తగ్గుతుంది. గచ్చిబౌలి ఔటర్ ఎగ్జిట్ నుంచి శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ నుంచి మైండ్ స్పేస్, దుర్గం చెరువు వంతెనల మీదుగా ప్రయాణిస్తే జూబ్లీహిల్స్ చెక్పోస్టుకు పది నిమిషాల్లో చేరుకోవచ్చు. గతంలో ఈ దూరానికి 45 నిమిషాలకు పైగా సమయం పట్టేది.
సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా వాహనాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు జీహెచ్ఎంసీ విశేషంగా కృషి చేస్తున్నది. రవాణా సౌకర్యం, వాహన కాలుష్యాన్ని తగ్గించడం, సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగుపరిచి వాహనదారులు చేరుకోవాల్సిన గమ్యస్థానానికి సకాలంలో చేరడానికిగాను స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (ఎస్ఆర్డీపీ) ప్రోగ్రామ్ ద్వారా చేపట్టిన పనులను ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
ఎస్ఆర్డీపీ పథకంలో జీహెచ్ఎంసీ 41 పనులు, మిగతా 6 పనులు ఆయా శాఖలైన హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ, నేషనల్ హైవే ద్వారా మొత్తం 47 పనులు చేపట్టారు. మొత్తం 47 పనుల్లో 32 పనులు పూర్తి కాగా మరో 15 పనులు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. పూర్తయిన 32 పనుల్లో 16 ఫ్లై ఓవర్లు, 5 అండర్ పాసులు, 7 ఆర్ఓబీలు, ఆర్యూబీలు, కేబుల్ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, పంజాగుట్ట వైడెనింగ్, ఓఆర్ఆర్ నుంచి మెదక్ రిహబిటేషన్ పనులు పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపారు. 17వ ఫ్లై ఓవర్ అయిన గచ్చిబౌలి ఐటీ కారిడార్ మీనాక్షి, ఐకియాలను కలుపుతూ రూ.466 కోట్ల వ్యయంతో 1.75 కిలో మీటర్ల పొడవున చేపట్టిన శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ను శుక్రవారం (నేడు) పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా ఈ ఫ్లై ఓవర్ ఉండటం గమనార్హం.
అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఔటర్ రింగు రోడ్డు ద్వారా గచ్చిబౌలి వరకు ఎలాంటి సమస్యలు లేకుండా నేరుగా చేరుకున్నప్పటికీ అకడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. అయితే శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుండటంతో ఇక ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య తప్పనున్నది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి మీదుగా పఠాన్ చెరువు, కోకాపేట్, నార్సింగ్తో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లేందుకు ఒక మార్గం, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, మాదాపూర్ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి గ్రేడ్ సపరేట్ మరొక ఫ్లై ఓవర్ బ్రిడ్జిని చేపట్టారు.
ఎస్ఆర్డీపీలో 17వ ఫ్లై ఓవర్