హైదరాబాద్ : హైదరాబాద్ నగర అభివృద్ధికి అడ్డు పడుతున్న కంటోన్మెంట్ అధికారులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కంటోన్మెంట్ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వాళ్లు రోడ్లు బంద్ చేస్తే.. తాము కరెంట్, నీళ్లు బంద్ చేస్తామని కేటీఆర్ తేల్చిచెప్పారు.
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కార్వాన్ నియోజకవర్గంలో నెలకొన్న నాలాల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఒక వైపు కంటోన్మెంట్లో చెక్ డ్యాం కట్టి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతోంది. శాతం చెరువు నుంచి గోల్కొండ కిందకు ఏఎస్ఐ అనుమతి తీసుకొని నీళ్లు వదులుదామంటే అక్కడ ఏఎస్ఐ అనుమతి ఇవ్వడం లేదు. ఒక వైపు కంటోన్మెంట్, మరో వైపు ఏఎస్ఐ అడ్డు పడుతోంది. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ వేరే దేశం అన్నట్టు కేంద్రం విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది. హైదరాబాద్లో ఉంటున్నప్పుడు కంటోన్మెంట్ కలిసిమెలిసి ఉండాలి. కానీ ఇష్టమొచ్చినట్లు రోడ్లు బంద్ చేస్తాం.. నాలాల మీద చెక్ డ్యాంలు కడుతామంటే మేం కూడా ఊరుకోం అని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం. అవసరమైతే మంచినీళ్లు, కరెంట్ బంద్ చేస్తాం. అప్పుడైనా దిగిరారా అని కేటీఆర్ పేర్కొన్నారు.
కంటోన్మెంట్ అధికారులను తక్షణమే పిలిచి మాట్లాడాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఆదేశిస్తామని కేటీఆర్ తెలిపారు. ఒక వేళ వారు వినకపోతే తీవ్రమైన చర్యలకు, కఠిన చర్యలకు కూడా వెనుకాడొద్దని.. రాష్ట్ర ప్రభుత్వం తరపున శాసనసభలో చెప్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. పైసా సాయం చేయరు కానీ పని చేస్తున్న ప్రభుత్వానికి అవరోధం కలిగించడం సరికాదని కేటీఆర్ మండిపడ్డారు.