ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు దాదాపు 1.33 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగంలో అనేక పెట్టుబడులను ఆకర్షించి దాదాపు 15 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించినట్లు చెప్పారు. జలమండలిలో మేనేజర్లు (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు)గా టీఎస్పీఎస్సీ నుంచి ఉద్యోగం పొందిన 93 మందికి గురువారం ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ నియామకపత్రాలు అందజేశారు. విజయవంతంగా ఉద్యోగాలు సాధించి నియామకపత్రాలు తీసుకున్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇప్పటిదాకా సుమారు లక్షా 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని, ఇకముందు కూడా ఖాళీలను భర్తీ చేస్తామని హామీఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రత్యేకత ఉందని, కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వచ్చిన యువ ఇంజినీర్లు ప్రజలకు సేవ చేసేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నదని, ఒక్క రూపాయి ఇవ్వకుండాప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా సాధించారో, అదేవిధంగా ఒక రూపాయి లంచం తీసుకోకుండా నిజాయితీతో పనిచేసి పారదర్శక సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాన్ని సవాల్గా తీసుకొని, జలమండలికి మరింత పేరు తీసుకు రావడంతోపాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు.