‘వ్యాధి నిర్ధారణ పరీక్షలు భారంగా మారుతున్నాయి. ప్రైవేటులో వేలాది రూపాయలు ఖర్చవుతున్నది. ఆర్థికభారాన్ని తప్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 20 కేంద్రాలకు 18 చోట్ల అందుబాటులోకి వచ్చినయి. ప్రస్తుతం వీటిల్లో 57 రకాల వైద్య పరీక్షలు చేస్తుండగా, త్వరలో 134 పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నిరకాల పరీక్షలు ప్రారంభమైతే ప్రైవేటు కేంద్రాలకు వెళ్లే బాధ ఉండదు. ఇప్పటివరకు 27 లక్షల మంది తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో సేవలను వినియోగించుకున్నారు.
ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో మందుల కోసం బయటకు రాస్తే.. డాక్టర్లు కూడా బయటకే పోవాల్సి వస్తుంది. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి చిత్తశుద్ధితో రోగులకు సేవలందించాలి. నిమ్స్లో అదనంగా 2 వేల పడకలు.. గాంధీ, నిమ్స్ దవాఖానల్లో 200 పడకలతో మాతాశిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. నగరానికి 3 వైపులా సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం’ అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. గ్రేటర్వ్యాప్తంగా 8 డయాగ్నోస్టిక్ మినీహబ్లు బుధవారం అందుబాటులోకి వచ్చాయి. నార్సింగి ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్ను మంత్రి హరీశ్రావు, మలక్పేటలో హోంమంత్రి మహమూద్అలీ, మిగతాచోట్ల ఎమ్మెల్యేలు ప్రారంభించారు.
సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ)/మణికొండ: ‘బస్తీ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. 350 బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకొచ్చారు’ అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం నార్సింగి రూరల్ హెల్త్ సెంటర్లో డయాగ్నోస్టిక్ మినీ హబ్, వ్యక్తిగత ఆరోగ్య నివేదిక యాప్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకటి కరుణతో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఆరోగ్యకేంద్రం మొత్తం కలియ తిరిగి వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎంతమంది ఓపీ పేషెంట్లు వస్తున్నారు..? ఎంతమంది స్టాఫ్ ఉన్నారం’టూ రికార్డులను పరిశీలించి.. వైద్యాధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘34 మంది సిబ్బంది ఉన్నా… వారం రోజులుగా కేవలం నలుగురు రోగులే రావడమేంటి’..అని ప్రశ్నించారు. ‘పద్ధతి మారకుంటే.. మీరు ఇక్కడి నుంచి మారాల్సి వస్తుంద’న్నారు. అనంతరం మంత్రి పలు అంశాలపై మాట్లాడారు.
ప్రస్తుతం 57..
పేదలకు ఆర్థిక భారం తగ్గించేందుకు డయాగ్నోస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రస్తుతం ఇందులో 57 రకాల వైద్యపరీక్షలు చేస్తున్నారు. త్వరలో వాటి సంఖ్యను 134కు పెంచుతాం. ఏడాది కాలంలో ఇప్పటి వరకు డయాగ్నోస్టిక్ సెంటర్ల ద్వారా 27లక్షల మంది సేవలు పొందారు. 350 బస్తీ దవాఖానలతో పాటు 20 రేడియాలజీ ల్యాబ్లలో 18 అందుబాటులోకి తీసుకొచ్చాం. బస్తీ దవాఖాన లేదా డయాగ్నోస్టిక్ మినీ హబ్ ఎక్కడుందో తెలుసుకునేందుకు మొబైల్ యాప్ను సైతం అందుబాటులోకి తెచ్చాం. ఈ యాప్లో రోగులకు సంబంధించిన డేటా కూడా నిక్షిప్తమై ఉంటుంది.
గత ప్రభుత్వాలు ఒక్క దవాఖానా నిర్మించలేదు..
200 ఏండ్ల కిందట బ్రిటీష్ ఆర్మీ కోసం ‘కింగ్ ఎడ్వర్డ్’ పేరుపై గాంధీ దవాఖానను, వందేండ్ల కిందట నిజాం సర్కార్ ఉస్మానియాను నిర్మిస్తే.. ఎన్నో ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఒక్క దవాఖానను కూడా నిర్మించలేదు. ప్రజలకు వైద్యసేవలను మరింత చేరువచేసేందుకు సీఎం కేసీఆర్ నగరం నలువైపులా నాలుగు సూపర్స్పెషాలిటీ హాస్పిటళ్లకు శ్రీకారం చుట్టారు. గచ్చిబౌలిలో ప్రస్తుతం 6 లక్షల ఎస్ఎఫ్టీలో టిమ్స్ సేవలు అందిస్తున్నది. దీనిని రీ మోడల్ చేసి మరో 7లక్షల ఎస్ఎఫ్టీలో కొత్త భవనాన్ని నిర్మిస్తాం.
ఇంటింటికీ బీపీ, షుగర్ మందులు..
మన జనాభాలో 10 శాతం మందికి షుగర్, 20 శాతం మందికి బీపీ ఉంది. నిర్లక్ష్యం చేస్తే ప్రధాన అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే రాష్ట్రంలో ఇంటింటికీ ఉచితంగా బీపీ, షుగర్ మందులు ఇవ్వనున్నాం. ప్రజలకు తేలికగా అర్థం కావడం కోసం మూడు రంగుల బ్యాగ్లను ఇస్తాం. తెలుపు రంగు బ్యాగులో ఉదయం వేసుకోవాల్సిన మందులు, గోధుమ రంగు బ్యాగ్లో మధ్యాహ్నం మందులు, నలుపు రంగు బ్యాగులో రాత్రి వేసుకోవాల్సిన మందులను ఉంచి.. ఆశావర్కర్లు ఇంటింటికీ వెళ్లి వాటిని అందించి..రోగులను పర్యవేక్షిస్తారు.
ఉచితంగానే..
అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ కింద రూ.10లక్షలు కేటాయించి.. రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. మోకాళ్ల మార్పిడి సైతం ఉచితంగానే జరుపుతున్నాం. రాష్ట్రం ఏర్పడినప్పుడు సర్కార్ దవాఖానల్లో కేవలం 30 శాతం మాత్రమే ప్రసవాలు జరిగేవని, నేడు 56 శాతానికి పెరిగాయి. వైద్యఆరోగ్యశాఖలో 13వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ను విడుదల చేస్తాం.
నిమ్స్లో..
ప్రస్తుతం నిమ్స్ దవాఖానలో 1400 పడకలే ఉండటంతో బెడ్ల కొరత ఉంటున్నది. దీనిని అధిగమించేందుకు మరో 2000 పడకలతో నూతన భవనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నాం. దీనివల్ల నగరంలో మొత్తం 6000 సూపర్స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వస్తాయి.
బడ్జెట్ను డబుల్ చేశాం..
వైద్య, ఆరోగ్యశాఖ బడ్జెట్ను డబుల్ చేశాం. ఇప్పటికే రూ.11వేల కోట్లు కేటాయించాం. మందులకు ఎలాంటి కొరత లేదు. మందుల చీటీ బయటకు రాస్తే..డాక్టర్లను కూడా బయటకు పంపిస్తాం. నిమ్స్, గాంధీ దవాఖానల్లో 200 పడకల ఎంసీహెచ్(మదర్ అండ్ చైల్డ్ హెల్త్సెంటర్)ను
నిర్మించనున్నాం.
ప్రైవేటోళ్లకు గిరాకీ తగ్గాలి..
ప్రైవేటులో గిరాకీ తగ్గి సర్కార్ దవాఖానల్లో పెరిగే విధంగా వైద్యసిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులు సైతం కృషి చేయాలి. ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడు కనీసం గంట సేపు అయినా తమ ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలను సందర్శించి సేవలను పర్యవేక్షించాలి. సీఎం ఆలోచన మేరకు ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేద్దాం.
‘ఉస్మానియా’కు కొత్త భవనానికి కసరత్తు చేస్తున్నాం
హోం మంత్రి మహమూద్ అలీ
సైదాబాద్, మే 11 : ఉస్మానియా దవాఖాన కొత్త భవనం నిర్మాణానికి కసరత్తు జరుగుతున్నదని, హెరిటేజ్ బిల్డింగ్ కావడంతో న్యాయపరమైన ఇబ్బందులు వచ్చాయని, అవి తొలగిన వెంటనే పనులు ప్రారంభిస్తామని హోం మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. మలక్పేట ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ మినీ హబ్ను మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాలతో కలిసి ప్రారంభించారు. పేద ప్రజల విద్య, ఆరోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధ్యానత ఇస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వసతులు కల్పించి కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా దవాఖానల సమన్వయ అధికారి డాక్టర్ సునీత, మలక్పేట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ త్రిలోక్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో..
శేరిలింగంపల్లి, మే 11: శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ మినీ హబ్ను ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రారంభించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ అమర్సింగ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, డీఐవో స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
నిర్ధారణ ఉచితం..
గ్రేటర్వ్యాప్తంగా ఎనిమిది డయాగ్నోస్టిక్ మినీ హబ్ల ప్రారంభంపేదలకు ఉచిత వైద్య పరీక్షలు అందించేందుకు గ్రేటర్వ్యాప్తంగా మరో ఎనిమిది డయాగ్నోస్టిక్ మినీ హబ్లు అందుబాటులోకి వచ్చాయి. బుధవారం నార్సింగిలో మినీహబ్ను మంత్రి హరీశ్రావు లాంఛనంగా ప్రారంభించగా, మిగిలిన వాటిని వేర్వేరు ప్రాంతాల్లో ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.
కుషాయిగూడ ఆరోగ్య కేంద్రంలో..
చర్లపల్లి, మే 11: కుషాయిగూడ ఆరోగ్య కేంద్రంలో డయాగ్నోస్టిక్ మినీ హబ్ను ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ నారాయణరావు, జాయింట్ డైరెక్టర్ ప్రభావతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్చార్జి డాక్టర్ స్వప్నారెడ్డి, రేడియాలజిస్టు డాక్టర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు.
అల్వాల్ పీహెచ్సీలో..
అల్వాల్, మే 11: అల్వాల్ పీహెచ్సీలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు డయాగ్నోస్టిక్ మినీ హబ్ను ప్రారంభించారు. పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో అల్వాల్, మచ్చ బొల్లారం, వెంకటాపురం కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్రెడ్డి, జితేంద్రనాథ్, సబితాకిశోర్, జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్వో ఆనంద్, అల్వాల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.
హయత్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో..
హయత్నగర్, మే 11: హయత్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ మినీ హబ్ను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఈసీజీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్తోపాటు ఇతర రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ చైర్పర్సన్ సీహెచ్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
బుద్వేల్లో..
బండ్లగూడ, మే 11: ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్ గ్రామంలో కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో కలిసి ప్రారంభించారు.