చార్మినార్, ఆగస్టు 26: సిటీ కాలేజీ విద్యార్థులెందరో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిటీ కాలేజీ వందేళ్ల వసంతోత్సవ కార్యక్రమాల్లో భాగంగా రెండోరోజు శుక్రవారం మంత్రి హరీశ్ రావు ముఖ్య అథితిగా హాజరయ్యారు. కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి సిటీ కాలేజీ విద్యార్థులు రూపొందించిన ఆర్ట్స్ గ్యాలరీని తిలకించారు. కాలేజీ విద్యార్థి లావణ్య తన్నీరు హరీశ్ రావుకు చిత్రపటాన్ని రూపొందించి అందించారు. చిత్రపటాన్ని స్వీకరించిన హరీశ్ రావు ముగ్ధులయ్యారు. లావణ్య ప్రతిభను మెచ్చుకుంటూ భవిష్యత్తులో చిత్రకళలో మరింత ఉన్నతంగా రాణించాలని అభిలషించారు. అనంతరం, హరీశ్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన తొలి, మలి ఉద్యమాల్లో సిటీ కాలేజీలో చేసిన పోరాటం మరువలేనిదన్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు’ నిర్వహించుకుంటున్న సమయంలోనే ఈ కళాశాల వందేళ్ల పండుగ జరుపుకోవడం నిజంగా అద్భుతమన్నారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ సందర్భంలో అనేక సార్లు ఈ కళాశాల గురించి, ఇక్కడి వీరోచితమైన విద్యార్థుల చైతన్యం గురించి పదే పదే చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. మూసీనది ఒడ్డున హై కోర్ట్, ఉస్మానియా ఆసుపత్రి, సిటికాలేజీ లాంటి విద్యాసంస్థ నిర్మించడం నిజాం దార్శనికతను తెలియజేస్తుందన్నారు. విద్యార్థులు కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకే పరిమితం కాకుండా, సివిల్స్ వంటి అత్యున్నత సర్వీసుల కోసం ప్రయత్నించాలని సూచించారు. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని, సహకారం అందించాలని సూచించారు. ఈ విద్యా సంస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నదన్నారు. అందుకు అనుగుణంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక వర్గం ప్రణాళికలను రూపొందించాలని తెలిపారు. విద్యాశాఖ మంత్రితో సమన్వయం చేసుకుని కళాశాల సంరక్షణకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు తెలిపారు. కళాశాల పూర్వ ఆచార్యులు డాక్టర్ విజయ్ భాస్కర్, రజియా సుల్తానాలు మాట్లాడుతూ కళాశాల చరిత్ర, ప్రాధాన్యత గురించి విద్యార్థులకు పలు విషయాలను వెల్లడించారు. కళాశాలకు ప్రిన్సిపాల్గా విధులు నిర్వహించడం ఎంతో గొప్ప అవకాశమని ప్రిన్సిపాల్ డాక్టర్ బాల భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో దేశపతి శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ ఐజాజ్ సుల్తానా, యాదయ్య, రత్న ప్రభాకర్, అధ్యాపక బృందం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జీవితం పట్ల ప్రేమను నేర్పింది సిటి కాలేజీ
మాజీ వీసీ ఎస్వీ సత్యనారాయణ
కాలేజీ పూర్వ విద్యార్థి తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఎస్వీ సత్యనారాయణ తన జ్ఞపకాలను విద్యార్థులతో పంచుకున్నారు. తన వ్యక్తిగత జీవితంలోనూ, రాష్ట్రంలోనూ కళాశాల ప్రాముఖ్యతను, పాత్రను వివరించారు. కవిగా, రచయితగా, పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా ఉపకులపతిగా సాధించిన ఉన్నతికి ఇక్కడ పొందిన ప్రేరణే తనకు స్ఫూర్తినిచ్చిందన్నారు. జీవితం పట్ల ప్రేమను, సామాజిక బాధ్యతను ఇక్కడే నేర్చుకున్నట్లు వివరించారు.
కుటుంబంగా.. కాలేజీ వాతావరణం
నిజాం ముని మనవడు మీర్ నజాఫ్ అలీఖాన్
కాలేజీ వాతావరణం కుటుంబాన్ని తలపిస్తున్నదని మీర్ నజాఫ్ అలీ అన్నారు. ఆప్యాయత, లక్ష్యంతో నిండిన వాతావరణం, హైదరాబాద్ నగరానికి తాత మీర్ ఉస్మాన్ అలీఖాన్ అందించిన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతున్నని అన్నారు.