మేడ్చల్, అక్టోబర్ 3 : ఈషాసింగ్ విజయపథం యువతకు ఆదర్శమని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన చెందిన బీబీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఈషా ఏషియన్ గేమ్స్లో పాల్గొని, షూటింగ్లో ఒక బంగారు, మూడు రజత పతకాలను సాధించింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ మైదానంలో మంగళవారం 20 వేల మంది విద్యార్థులతో సన్మాన సభను ఏర్పాటు చేశారు.
ఈ సభలో మంత్రి మాట్లాడుతూ.. ఒక మహిళ షూటింగ్లో పతకాలను సాధించడం దేశంలోనే ప్రప్రథమం అని అన్నారు. విద్యార్థిని ఈ ఘనతను సాధించడం యూనివర్సిటీతో పాటు దేశానికే గర్వకారణమన్నారు. ఆసక్తి ఉన్న రంగంపై దృష్టి సారించి, కష్టపడితే అద్భుతాలు సాధించవచ్చన్నారు. ఇందుకు ఈషా విజయమే నిదర్శనమన్నారు. అతి పిన్న వయస్సులోనే ఈషాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్నారు. షూటింగ్ వైపు మహిళలు వెళ్లరని, ఈషా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించాలన్న లక్ష్యంతో అటువైపు వెళ్లారన్నారు. తన ఆసక్తిని గుర్తించి, షూటింగ్కు ప్రోత్సహించిన ఈషా తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రోత్సాహకంగా ఈషాకు రూ.10 లక్షలను చెక్ రూపంలో మంత్రి మల్లారెడ్డి అందజేశారు. భవిష్యత్లో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
పతకాలను సాధించి రాష్ట్రంలో అడుగుపెట్టిన ఈషా సింగ్కు మల్లారెడ్డి యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయానికి మంత్రి మల్లారెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి, యూనివర్సిటీ యాజమాన్య కమిటీ సభ్యులు డాక్టర్ ప్రీతిరెడ్డి, భద్రారెడ్డి, శాలినీ రెడ్డి, వైస్ చాన్సలర్ వీఎస్కే రెడ్డి, విద్యార్థులు, అధ్యాపకులు వెళ్లి స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ఈషా విజయానికి సంకేతంగా నినాదాలు చేశారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఓపెన్ టాప్ జీపులో మంత్రి మల్లారెడ్డి, ఈషాసింగ్ పయనిస్తుండగా.. విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా కొద్ది దూరం ర్యాలీ నిర్వహించారు.