ఘట్కేసర్, అక్టోబర్ 3 : వచ్చే ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవడానికి కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని, వారు చెప్పే మాయమాటలు ఎవరూ నమ్మొద్దని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం ఘట్కేసర్ మున్సిపాలిటీలో రూ.2కోట్ల 17లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్తో కలిసి మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇన్ని రోజులు కన్పించని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలు వస్తుండటంతో వారికి ఇప్పుడు ప్రజలు గుర్తుకొస్తున్నారన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కమిషనర్ ఎండీ సాబేర్ అలీ, పోచారం చైర్మన్ బి.కొండల్రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతుందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో దినదినాభివృద్ధి చెందుతున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రగతిలో దూసుకెళ్తుందని చెప్పారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పలు డివిజన్లలో మంగళవారం రూ.4.79 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మేయర్ జక్క వెంకట్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు, గ్రంథాలయ చైర్మన్ దర్గదయాకర్రెడ్డిలతో కలిసి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలు డివిజన్లలో మంత్రికి ఘన స్వాగతం పలికారు.
– పీర్జాదిగూడ, అక్టోబర్ 3
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ చేసిన కృషితో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని మైసమ్మగూడలో రూ.2.20 కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్లు, అంతర్గత మురికి కాలువలు, ఆర్సీసీ పైప్లైన్ నిర్మాణ పనులతోపాటు పలు అభివృద్ధి పనులకు మంగళవారం మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీశ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ రాములు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
– మేడ్చల్ రూరల్, అక్టోబర్ 3