ఖైరతాబాద్, జనవరి 29 : నెక్లెస్రోడ్ పీవీ మార్గ్లోని జలవిహార్ వేదికగా జరిగిన మినీ మారథాన్ ఉత్సాహంగా సాగింది. నిరుపేద ఆదివాసీ గిరిజన విద్యార్థులకు ఉచిత విద్యనందించడమే లక్ష్యంగా ప్రొఫెసర్ అచ్యుత సమంత స్థాపించిన కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం రజతోత్సవం సందర్భంగా 1కే, 3కే, 5కే మారథాన్ నిర్వహించారు. ఈ మారథాన్కు ముఖ్యఅతిథులుగా హాజరైన ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సీనియర్ జర్నలిస్టు పిట్టల రవీందర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాజా రమేశ్, వీఎన్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల అభ్యున్నతికే రన్
ఇనార్బిట్ దుర్గంచెరువు రన్ మూడవ ఎడిషన్ ఆదివారం సందడిగా సాగింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దివ్యాంగుల అభ్యున్నతికి రన్ నిర్వహించడం అభినందనీయమని, రన్ ద్వారా రూ.54లక్షలు సేకరించడం గొప్ప విషయమన్నారు. మూడు విభాగాలు 5కే, 10కే, 21కే రన్ల ద్వారా సేకరించిన మొత్తాన్ని దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్, కే రహేజా కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రావణ్ గోణె, తెలంగాణ ఐటీ చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ శ్రావణ్కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
అట్టహాసంగా సైక్లోథాన్
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదాపూర్లోని న్యాక్ ప్రాంగణం వద్ద భారత ప్రభుత్వం సైక్లోథాన్, డబ్ల్యూసీఏ, హెచ్బీసీ, స్మార్ట్ బైక్, ఎస్సీఎస్సీ, సీఐఐవైఐ, ఆలిండియా బైస్కిలింగ్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సైక్లోథాన్ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫుడ్ సేప్టీ, స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా జి.కమలవర్ధనరావు విచ్చేసి వరల్డ్ సైక్లింగ్ అలియన్స్ అధ్యక్షుడు గ్రహం వాట్సన్, వరల్డ్ సైక్లింగ్ అలియన్స్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ డీవీ మనోహర్తోపాటు హైదరాబాద్ బైస్కిలింగ్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో భాగంగా సైకిళ్లతో 5కి.మీ, జాయ్ రైడ్ 10 కి.మీ, మాస్ రైడ్ 25 కి.మీ, 50 కి.మీ, ఎండ్యూరెన్స్ రైడ్, 100 కి.మీ సెంచరీ విభాగాల్లో సైక్లోథాన్ను నిర్వహించారు. – మాదాపూర్, జనవరి 29