వెంగళరావునగర్, మే 15 :అందరూ గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇల్లంతా దట్టంగా పొగ అలుముకుంది. మెలకువ వచ్చి బాల్కని తలుపు తెరిచి చూస్తే.. ఏసీ కంప్రెషర్ నుంచి మంటలు వ్యాపించి ఉన్నాయి. కాసేపటికి కంప్రెషర్ పేలిపోయింది. కంగారుతో బెడ్రూమ్ డోర్ తెరిచిన వెంటనే దట్టంగా పొగ అలుముకుంది. ఏసీలోంచి నిప్పురవ్వలు వచ్చి మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన కుటుంబీకులు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. కష్టపడి కూడబెట్టిన రూ.10.60 లక్షలు, అరకిలో బంగారు ఆభరణాలతో పాటు సర్వస్వం కాలి బూడిదయ్యాంటూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు.
మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్గూడలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. యసూఫ్గూడ బస్తీ విశ్వవిహార్ అపార్ట్మెంట్స్లోని 4వ అంతస్తులో ఉద్దగిరి త్రివేణి(59) అనే వైద్యురాలు తన తల్లిదండ్రులు వై.ప్రసాదరావు(91), వై.లక్ష్మీ(81)తో కలిసి నిద్రిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక గదిలో పొగ నిండుకున్నట్లు వాసన రావడం తో త్రివేణికి మెలకువ వచ్చిం ది.
రూమ్లోని ఏసీలోంచి నిప్పురవ్వలు ఎగిరిపడి మంటలు వచ్చా యి. దీంతో తల్లిదండ్రులను అప్రమత్తం చేసి సురక్షితంగా వారిని బయటకు తెచ్చింది. మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న ఫర్నీచర్, అల్మారాల్లో దాచుకున్న అరకిలో కు పైగా బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండి సామాగ్రి, రూ.10.60 లక్షల కరెన్సీ నోట్ల కట్టలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఆస్తి పత్రాలు, గుర్తింపు పత్రాలు, ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బులు కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.