చార్మినార్, జూన్ 28 : జాతీయస్థాయిలో ప్రతి నెలా జరిగే మెగాలోక్ అదాలత్ను కక్షిదారులందరూ ఉపయోగించుకుని సత్వర కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సిటీ సివిల్ కోర్ట్ చీఫ్ జడ్జ్, సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సం స్థ చైర్పర్సన్ డాక్టర్ సుమలత పిలుపునిచ్చారు. ఈ నెల 10న సిటీ సివిల్ కోర్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా లోక్ అదాలత్ సన్నాహక చర్యల్లో భాగంగా పురాణిహవేలిలోని సిటీ సివిల్ కోర్ట్ సమావేశ మందిరం నుంచి బార్ అసోసియేషన్ ప్రతినిధులతోపాటు ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులు, మోటార్ యాక్సిడెంట్ క్లయిమ్ దారుల న్యాయవాదులతో వెబినార్ నిర్వహించారు. అనంతరం సిటీ సివిల్ కోర్ట్ చీఫ్ జడ్జీ సుమలత మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వార కక్షిదారులు తమ కేసులను సత్వరం పరిష్కరించుకునేందుకు వేదికగా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 10వ తేదీన నిర్వహించే మెగా లోక్ అదాలత్లో సివిల్ దావాలతోపాటు కుటుంబ వివాదాలు, మోటార్ ప్రమాదాల పరిహార కేసులను సులువుగా పరిష్కరించుకోవచ్చని సూచించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టుల పరిధిలో నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కక్షిదారులకు సత్వర న్యాయం లభించే విధంగా ఉభయ పక్షాల రాజీమార్గం ద్వార అప్పీలుకు తావులేని విధంగా పెండింగ్ కేసులను పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఈ సమావేశంలో సిటీ సివిల్ కోర్ట్ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జీ కె.మురళీమోహన్తోపాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగం నారాయణ పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.