ఎల్బీనగర్, ఫిబ్రవరి 11: ఎల్బీనగర్లోని సరూర్నగర్ ఇండోర్స్టేడియంలో నిర్వహించిన మెగా జాబ్మేళాకు అనూహ్య స్పందన లభించింది. ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఈ మేళాలో 130 కంపెనీలతో పాటు 25 వేలకు పైగా యువతీయువకులు పాల్గొన్నారు. ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి విద్యార్హతను బట్టి ఇంటర్వ్యూ నిర్వహించి అక్కడికక్కడే ఉద్యోగాలు ఇచ్చారు.
అత్యధిక జీతం.. ఆనందంలో అభ్యర్థులు
ఈ జాబ్మేళాలో ఎల్బీనగర్కు చెందిన అభ్యర్థి మల్లేశ్వరి ప్రీమియర్ హెల్త్కేర్ సెంటర్లో అత్యధికంగా రూ.40 వేల జీతంతో ఉద్యోగం సాధించింది. అపోలో ఫార్మాలో శిరీష (రూ.16 వేలు), ప్రీమియర్ హెల్త్ కేర్లో చంపాపేట్కు చెందిన చాంద్ పాషా (రూ.15 వేలు), మెడ్ప్లస్ సంస్థలో కొత్తపేటకు చెందిన నందిని (రూ. 10,500), దిల్సుఖ్నగర్కు చెందిన శ్రావణి (రూ.10.500) సైతం ఉద్యోగాలు సాధించారు. కొన్ని కంపెనీలు అక్కడే అభ్యర్థులను ఎంపిక చేసి జీతాలు ప్రకటించగా.. మరికొన్ని కంపెనీలు మాత్రం దరఖాస్తులు తీసుకొని తర్వాత సమాచారం ఇస్తామని ప్రకటించాయి. మొత్తంగా అన్ని కంపెనీలు కలిపి ఒక్కరోజే నాలుగు వేల మందికి ఉద్యోగాలు కల్పించాయి.
భారీ ఏర్పాట్లు..
జాబ్మేళాకు భారీగా అభ్యర్థులు రావడంతో నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల తాకిడిని ముందుగానే ఊహించిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఇందుకనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయించారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు జాబ్మేళా ప్రాంగణంలోనే ఉండి అభ్యర్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూశారు.