సిటీబ్యూరో, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): బడికి వెళ్లే చిన్నారులు ప్రతిరోజూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రధాన లక్ష్యమని ట్రాఫిక్ అదనపు సీపీ జి.సుధీర్బాబు అన్నారు. నగరంలోని పాఠశాలల యాజమాన్యాలు, ప్రతినిధులతో స్కూల్ జోన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం నగర ట్రాఫిక్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు సీపీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది స్కూల్ జోన్లలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంతో, విద్యార్థులు సురక్షితంగా ప్రయాణం చేసేలా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు ప్రారంభం, ముగింపు సమయాల్లో ట్రాఫిక్ రద్దీ, పిల్లల వ్యక్తిగత భద్రత, వాహనాల ఫిట్నెస్, సమయపాలన తదితర అంశాలకు సంబంధించి ఈ సమావేశంలో ట్రాఫిక్ అధికారులు మాట్లాడారు. స్కూల్ జోన్లలో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలు..వాటి పరిష్కార చర్యలపై ఆయన వివరించారు.
స్కూల్స్ వద్ద ట్రాఫిక్ వలంటీర్లు, సెక్యూరిటీ గార్డులను తప్పనిసరిగా నియమించుకోవాలని, ఇందుకు ప్రతి పాఠశాల యాజమాన్యం సహకరించాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులతోనూ ట్రాఫిక్ సమస్య గురించి చర్చిస్తూ, పాఠశాలలకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రుల వాహనాలకు కూడా తగిన పార్కింగ్ను చూపించాలన్నారు. కొన్ని ప్రత్యేక జోన్లలో ఉన్న పాఠశాలలు తమ స్కూల్ సమయాల్లో మార్పులు చేసుకునే అవకాశముంటే తగిన ప్రతిపాదనలు తమకు వచ్చే సమావేశం వరకు అందించాలని సూచించారు. పాఠశాలల స్కూల్ బస్సుల ఫిట్నెస్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పటిష్టంగా ఉండేలా మెయింటెన్ చేసుకోవాలని, అటెండర్ ఉండేలా చూసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. వలంటీర్లకు శిక్షణ, అవసరమైన సామగ్రిని ట్రాఫిక్ పోలీసుల తరఫున అందుతుందన్నారు. డీసీపీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ.. స్కూళ్లలో ట్రాఫిక్ క్లబ్లు ఏర్పాటు చేయాలని, విద్యార్థుల తల్లిదండ్రుల సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. ఈ సమావేవంలో డీసీపీలు అశోక్కుమార్, శ్రీనివాస్ తదితర ఏసీపీలు పాల్గొన్నారు.