సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): నార్త్ సిటీ మెట్రో సాధనయే లక్ష్యంగా మేడ్చల్ మెట్రో సాధన సమితి మరో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమితి నాయకులు త్వరలో వాక్ ఫర్ కాజ్ పేరిట పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. నార్త్సిటీలో ఉండే ప్రజాప్రతినిధులు, స్థానికులు, యువతీయువకులతో పెద్దఎత్తున పాదయాత్ర నిర్వహించి తమ ప్రాంత అభివృద్ధి ప్రణాళికల్లో ఉన్న జాప్యానికి గల కారణాలను నిలదీసేందుకు సిద్ధం అవుతున్నారు.
ఆయా నియోజకవర్గాల పరిధిలోని స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకునేలా, మెట్రో విస్తరణ నిర్లక్ష్యాన్ని నిలదీసేలా ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్న నాయకులందరూ ఈ పాదయాత్రలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో జరిగే నిరసన, ఆందోళన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే వివేకానంద సంపూర్ణ మద్ధతు ప్రకటించిన నేపథ్యంలో.. మెట్రో ఫేజ్-2 పేరిట తమ ప్రాంత ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచనకు గురిచేస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. వచ్చే వారంలో జరిగే ఈ వాక్ ఫర్ కాజ్ కార్యక్రమం సుచిత్ర సర్కిల్ నుంచి జీడిమెట్ల గాంధీ చౌక్ వరకు సాగుతుందని, పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణం, మెట్రో అనుమతులు ప్రధాన అజెండాగా ఈ నిరసన కార్యక్రమం సాగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.