కొండాపూర్, ఫిబ్రవరి 4 : ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని లింగంపల్లి క్రాస్రోడ్డు సమీపంలోని నాలాపై రూ. 1.70 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కల్వర్టు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పనుల సాధనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నదన్నారు. ఓ వైపు కరోనా మహమ్మారి భయాబ్రాంతులకు గురి చేస్తున్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి రంగాలలో ప్రభుత్వం దూసుకుపోతున్నదన్నారు. ప్రజావసరాల దృష్ట్యా అవసరమైన ప్రాంతాల్లో నాలాలపై కల్వర్టుల నిర్మాణా పనులు చేపట్టినట్లు తెలిపారు. లింగంపల్లి క్రాస్రోడ్డు ప్రీతి కిడ్నీ సెంటర్ నుంచి చందానగర్కు వెళ్లే మార్గంలోని నాలా ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండడంతో పరిష్కార దిశగా నూతన కల్వర్టు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కల్వర్టు నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చేకూరనున్నదన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, నాయకులు శ్రీనివాస్ యాదవ్, వీ రాజేశ్వర్రెడ్డి, చంద్రకాంత్ రావు పాల్గొన్నారు.