సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్ హైదరాబాద్లో ప్రజారోగ్య భద్రతను మరింత పటిష్టం చేయడానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్(ఎంఎస్యూ) సిబ్బందికి 3 రోజుల సంయుక్త ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం జూబ్లీహిల్స్లోని డా.ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంగళవారం ప్రారంభమైంది. హైదరాబాద్తో పాటు బెంగళూరు, థానే నగరాలకు చెందిన ఎంఎస్యూ సిబ్బంది ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. నగరాల్లో వ్యాధుల నివారణ, నియంత్రణలో ఎంఎస్యూ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం-ఏబీహెచ్ ఐఎం) కింద ఏర్పాటు చేసిన ఎంఎస్యూ హైదరాబాద్ నగర వ్యాధుల పర్యవేక్షణకు కేంద్రంగా పనిచేస్తోందని కమిషనర్ తెలిపారు.
17 పోస్టులకు గాను ఇప్పటికే 14 మందిని నియమించగా, మిగిలిన ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. కొత్తగా నియమితులైన సిబ్బందికి శాఖాపరమైన శిక్షణ కొనసాగుతోందన్నారు. మూడు రోజుల శిక్షణలో భాగంగా ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫామ్ (ఐహెచ్ ఐపీ)పై ప్రత్యక్ష శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు హేమంత కేశవ్ పాటిల్, రఘు ప్రసాద్, జాయింట్ డైరెక్టర్ డా. శుభాంగి కుల్సంగే, డా. ప్రదీప్ అవాటే (ఎంఎస్యూ), జోనల్ కమిషనర్ ప్రియాంక అలా, చీఫ్ మెడికల్ ఆఫీసర్ (హెల్త్) డా. పద్మజ,చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ వకీల్ పాల్గొన్నారు.