పీర్జాదిగూడ, జనవరి 20 : ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు భవిష్యత్ అవసరాలకు అనేక అభివృద్ధి పనులు చేపడుతూ దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతున్నట్లు పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్రెడ్డి చెప్పారు. శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ల సమక్షంలో 22 అంశాలతో కూడిన ఎజెండాను ప్రవేశపెట్టారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..స్వచ్ఛ సర్వేక్షణ్ -2022లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.కోట్లు శానిటేషన్ విభాగానికి ఆటోలు కొనుగోలు, వార్డుల వారీగా కాంపోస్టు కేంద్రాలు ఏర్పాటు, డీఆర్సీసీ సెంటర్ అభివృద్ధికి, జేసీబీ కొనుగోలుకు, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆధునీకరణ, స్వచ్ఛ వలంటీల గౌరవ వేతనం కేటాయిస్తూ ప్రతిపాదనలను పంపించడం జరిగిందన్నారు. తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చోట పైపులైన్తోపాటు జంక్షన్ నిర్మించడం, వీధి వ్యాపారుల కోసం నిర్మింస్తున్న స్ట్రీట్ వెండర్లను త్వరలో పూర్తిచేసి అర్హులైన వారికి అందించడం జరుగుతుందన్నారు. ఆయా డివిజన్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం, పలు డివిజన్లలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటుతోపాటు ఇంటర్ ఫోల్స్, వివిధ కాలనీల్లో గుంతల మరమ్మతులు చేయాలని, కుక్కలు, పందుల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామకృష్ణారావు, కార్పొరేటర్లు, వివిధ విభాగాలు చెందిన అధికారులు పాల్గొన్నారు.