మాదాపూర్ : మాదాపూర్లోని ఓ ఇంట్లో అర్థరాత్రి భారీ దొంగతనం జరిగింది. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం … మాదాపూర్లోని కావూరి హిల్స్ పేజ్2 కి చెందిన వాసుదేవ రెడ్డి అనే వ్యాపారి మోయినాబాద్ సమీపంలో ఉన్న ఫామ్ హౌజ్లో పార్టీ ఉండటంతో తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్ళాడు.
పార్టీ పూర్తి చేసుకొని రాత్రి 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి కావూరిహిల్స్లోని తన ఇంటికి తిరిగి రాగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్ళి చూడగా పడక గదిలోని కబోర్డులో దాచిన రూ. 20 లక్షల నగదు, 10 వేల యూఎస్ డాలర్లు, 20 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించారు.
దీంతో ఇంటి యాజమాని వాసుదేవరెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసులో అనుమానితులను విచారిస్తున్నట్లు తెలిపారు.