Fire Accident | చార్మినార్ : నిత్యం వ్యాపారాలతో ఎంతో బిజీగా ఉండే దివాన్ దేవిడిలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేకువ జామున మంటలు చెలరేగి రూ.60కోట్ల విలువైన ఆస్తి బుగ్గిపాలైంది. స్థానికులు, అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దివాన్ దేవిడిలోని అబ్బాస్, మదినా టవర్లో దాదాపు 400 వరకు రెడీమెడీ వస్త్ర వ్యాపారాలు నిర్వహించే హోల్సోల్ దుకాణాలున్నాయి. ఎప్పటిలాగే పలువురు వ్యాపారాలు ఆదివారం రాత్రి తమ వ్యాపారాలను ముగించుకొని ఇండ్లకు వెళ్లిపోయారు. సోమవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో 4వ అంతస్తులో మంటలు వచ్చాయి. దీన్ని గమనించిన వాచ్మెన్ వెంటనే మొఘల్పుర అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించాడు.
వెంటనే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. వస్త్రాలు కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెంది.. అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటలు భారీగా పెరడం.. ఏమాత్రం తగ్గకపోవడంతో డిస్ట్రిక్ అగ్నిమాపక అధికారి వెంకన్న ఆదేశాలతో హైకోర్ట్, యాకుత్పుర, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మలక్పేట, సాలర్జంగ్ మ్యూజియం, రాజేంద్రనగర్ ఏరియాల నుంచి ఫైరింజన్లను రప్పించి.. 60 మంది సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. నాలుగో ఫ్లోర్లో చెలరేగిన మంటలు కొద్ది సేపట్లోనే సెల్లార్లోని 2 గ్రౌండ్ వరకు వ్యాపించాయని అధికారులు పేర్కొన్నారు. అబ్బసి మదినా టవర్లో చిన్న చిన్న గదులు ఉండడంతో మంటలు అదుపు చేయడం కాస్త ఇబ్బందికరంగా మారిందని అధికారులు తెలిపారు. సముదాయంలో 400 వరకు దుకాణాలు కొనసాగుతున్నాయని.. ఎక్కడా ఫైర్ సేఫ్టీ లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు.
మంటలు వ్యాపించిన భవనంలో వాచ్మెన్తో పాటు ఆయన కుటుంబపై అంతస్తులో నివాసం ఉంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది వారి గురించి కాపాడారు. అగ్ని ప్రమాదంలో దాదాపు రూ.60కోట్ల వరకు ప్రాథమికంగా ఆస్తినష్టం జరిగినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యుదాఘాతమే.. ఈ అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని చార్మినార్ ఎమ్మెల్యే మిర్ జుల్ఫీకర్ అలీ, ఫైర్ డీజీ జీవీ నారాయణ, అదనపు డీజీ ప్రసన్న కుమార్, డీసీపీ స్నేహ మిశ్రా, ఏసీపీ చంద్రశేఖర్, రీజినల్ ఫైర్ అధికారి హరినాథ్ రెడ్డి, అసిస్టెంట్ డిస్ట్రిక్ ఫైర్ అధికారులు ప్రధాకర్ రెడ్డి, షణ్ముఖ రావు, రఫీ సందర్శించారు.