ఖైరతాబాద్, జనవరి 24 : ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక శాఖ సకాలంలో స్పందించి ఫైరింజన్ల ద్వారా మంటలను ఆర్పివేసింది. బుధవారం తెల్లవారుజామున వేస్ట్ పేపర్, నిరుపయోగంగా పడివున్న మిషన్లు భద్రపర్చిన గోదాములో ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి.
ఆ వెంటనే మంటలు దావానంలా వ్యాపించడంతో మిషన్లు, కాగితాలు దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు., అగ్నిమాపక శాఖకు సంబంధించిన రెండు ఫైరింజన్లను రప్పించారు. సుమారు రెండు గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇన్స్పెక్టర్ బాలగోపాల్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనా స్థలాన్ని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గజ్జెల నాగేశ్, సీఐటీయూ నాయకులు ఈశ్వర్ బాబు తదితరులు పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.