సిటీబ్యూరో, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): గుర్రపు పందాలు కాసి లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ మోజులో పడి.. ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయడంతో సాఫ్ట్ వేర్ జాబ్ కూడా పోయింది. ఇక సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో మ్యాట్రిమోని వెబ్సైట్ను వేదికగా చేసుకున్నాడు. విదేశాల్లో ఉంటున్నట్లు నమ్మించి యువతులకు గాలం వేస్తున్నాడు. తాజాగా ఓ అమ్మాయిని మోసం చేయడంతో పోలీసులకు దొరికిపోయాడు. సైబర్ క్రైం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..విజయవాడ పోరంకి గ్రామానికి చెందిన వంశీకృష్ణ ప్రస్తుతం ఖమ్మం భురాన్పురా గ్రామంలో ఉంటున్నాడు. మ్యాట్రిమోని వెబ్సైట్లో తన పేరును సాయి ప్రణవ్గా ప్రొఫైల్ను రూపొందించి.. విదేశాల్లో ఉంటున్నట్లు కలరింగ్ ఇచ్చాడు.
ఈ ప్రొఫెల్ను చూసిన చౌటుప్పల్కు చెందిన ఓ యువతి సాయిప్రణవ్తో ఫోన్లో మాట్లాడింది. ఇద్దరు పరిచయం పెంచుకొని.. పెండ్లికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సాయి ప్రణవ్ వివాహం తర్వాత అమెరికాకు రావాలంటూ..చెప్పాడు. అంతర్జాతీయ బ్యాంక్ అకౌంట్ ఉండాలంటూ.. వీసా కోసం ఆధార్, పాన్ కార్డు, ఫొటోలతో పాటు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.90వేల తీసుకున్నాడు. ఆ తర్వాత బాధితురాలి ఇంటర్నెట్ బ్యాం కింగ్ వివరాలు తీసుకుని…యువతికి తెలియకుండా సుమారు 8 లక్షల రుణాన్ని పొందాడు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బాధితురాలితో మా ట్లాడకుండా తప్పించుకున్నాడు.
ఆమెకు రుణానికి సంబంధించిన ఈఎంఐ చెల్లించాలని మెసేజ్ రావడంతో బ్యాంక్లో ఆరా తీసింది. సాయిప్రణవ్ మోసం చేశాడని తెలుసుకొని..రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం వంశీకృష్ణ అలియాస్ సాయిప్రణవ్ను అరెస్ట్ చేశారు. రూ.3.20లక్షల నగదు, బ్యాంక్ పాసు బుక్, చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. వంశీకృష్ణ గతంలో కూడా ఇదే తరహాలో సుమారు నలుగురిని మోసం చేయడంతో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి బయటికి వచ్చినా.. తీరు మారలేదు. యువతులను మళ్లీ మోసం చేయడం మొదలుపెట్టాడు. చివరికి కటకటాలాపాలయ్యాడు.