సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): పెండ్లి చేసుకుంటానంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని నమ్మించి రూ.15.32 లక్షలు మోసం చేసిన నైజీరియన్కు చెందిన సైబర్నేరగాడిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశా రు. బోయిన్పల్లికి చెందిన ఓ యువతి సాఫ్ట్వేర్ ఉద్యోగిని. తన ప్రొఫైల్ను మరాఠీ మ్యాట్రిమోనీలో అప్లోడ్ చేసింది. ఇది చూసిన డాక్టర్ అమిత్ ఆనంద్ అనే ప్రొఫైల్ నుంచి పెండ్లి చేసుకుంటానంటూ ఆ యువతికి ప్రపోజల్ వచ్చింది. తన స్వస్థలం గుజరాత్లోని రాజ్కోట్ అని.. తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో ఉంటారని.. తాను మాత్రం నెదర్లాండ్స్లో డాక్టర్గా పని చేస్తున్నాన ని.. త్వరలో ఇండియాకు వచ్చి స్థిరపడుతానని పేర్కొన్నాడు. దీంతో ఆ యువతి పెండ్లికి అంగీకరించడంతో ఇద్దరు ఫోన్ నంబర్లు మార్చుకొని వాట్సాప్ ద్వారా చాటింగ్ చేయడం ప్రారంభించారు.
ఈ క్రమంలో తన వద్ద లగేజీ ఎక్కువగా ఉందని.. అందులో మెడికల్ పరికరాలతో పాటు 92 లక్షల యూరోలు ఉన్నాయని.. వాటితో ఇండియాలో దవాఖాన కట్టి స్థిరపడుదామని నమ్మించాడు. రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి పార్సిల్ వచ్చిందని.. అందులో డాలర్లు, విలువైన వస్తువులు ఉన్నాయని.. వాటికి కస్టమ్స్, ఇతర చార్జీలు చెల్లించాలంటూ దఫదఫాలుగా ఆమె నుంచి రూ.15.32 లక్షలు స్వాహా చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ గంగాధర్ బృందం నిందితులను నైజీరియన్లుగా గుర్తించారు. ఢిల్లీలో ప్రత్యేక బృందాలతో గాలించి నైజీరియన్కు చెందిన మైఖేల్ను అరెస్ట్ చేశారు. గత సంవత్సరం మెడికల్ వీసాపై వచ్చిన నిందితుడు పలువురిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.