సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): మ్యాట్రిమోని ఫ్రాడ్లో ఇదో కొత్త కోణం. వివాహం చేసుకుంటానని నమ్మించి ఖాతా తెరిపించి రూ.10 లక్షలు కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది. మోసపోయిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. వివరాలను పరిశీలిస్తే.. చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఏప్రిల్ నెలలో కమ్మ మ్యాట్రిమోని సైట్లో వరుడు కావాలని తన ప్రొఫైల్ను నమోదు చేసుకుంది. అదే సైట్లో ఓ యువకుడు సాయిప్రణవ్గా నమోదు చేసుకుని యువతికి పరిచయమయ్యాడు. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. మీ ప్రొఫైల్ నచ్చిందంటూ తాను హైదరాబాద్లో ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నానని, కరోనా కారణంగా ప్రస్తుతం వైజాగ్లోని తన నివాసం నుంచి పని చేస్తున్నానని వివరించాడు. తొందర్లోనే మీ ఇంటికి మా పెద్దవాళ్లతో వచ్చి వివాహ సంబంధం గురించి మాట్లాడుకుందామని తెలిపాడు. ఈ మాటలను నమ్మిన యువతి సరే అని స్పందించింది.
ఓ రోజు ఫోన్ చేసి మా నాన్నకు ఆరోగ్యం బాగా లేదు.. కొద్ది రోజుల తర్వాత వస్తాను.. ఆ తర్వాత వివాహం.. పెండ్లి అయిన తర్వాత అమెరికా వెళ్లాల్సి ఉంటుందని, వీసా ప్రక్రియను మొదలుపెడతానని చెప్పాడు. నీవు అంతర్జాతీయ బ్యాంక్లో ఖాతాను తెరిచి రూ.90 వేలు తనకు పంపించమని అడిగాడు. యువతి అంతర్జాతీయ బ్యాంక్ ఖాతాను తెరిచి తన ఆధార్, పాన్కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, పాసుబుక్, డెబిట్ కార్డు వివరాలను ఫొటో రూపంలో పంపింది. ఆ తర్వాత రోజు సాయిప్రణవ్ ఫోన్ చేసి, మా నాన్న ఖాతా నుంచి నీకు రూ.8 లక్షలు వస్తాయి, వెంటనే వాటిని తిరిగి నా ఖాతాకు పంపాలని సూచించాడు. యువతి తనకు ఆన్లైన్ బ్యాంక్ లావాదేవీలు తెలియదని చెప్పింది. సాయిప్రణవ్ నీ ఎస్బీఐ యోనో యాప్ అప్లికేషన్ వివరాలను పంపించాలని అడిగాడు. ఆ వివరాలను సేకరించి ఆమె ఖాతాలో పడ్డ రూ. 8 లక్షలు మళ్లించుకున్నాడు. ఆ తర్వాత మరికొంత నగదు కావాలంటూ అడగడంతో యువతి తన దగ్గర నగదు లేదని చెప్పింది. అయితే, వీసా ప్రక్రియ ఆలస్యమవుతుంది.. ఎలా అని కంగారు పెట్టాడు.
యువతి తన దగ్గర బంగారం ఉందని చెప్పింది. అయితే, తన స్నేహితుడు వంశీకృష్ణ వస్తాడని చెప్పి.. అతడి ఫోన్ నంబర్ను ఇచ్చాడు. ఓ వ్యక్తి వంశీకృష్ణ అంటూ వచ్చి యువతి నుంచి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు తీసుకెళ్లిపోయాడు. మే నెలలో యువతికి ఎస్బీఐ బ్యాంక్ నుంచి 8 లక్షల రుణానికి ఈఎమ్ఐ చెల్లించాలని మెసేజ్ వచ్చింది. కంగుతిన్న యువతి వెంటనే బ్యాంక్ను సంప్రదించి వివరాలు తెలుసుకుంది. మోసపోయానని నిర్ధారించుకున్న యువతి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మోసానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు.