కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 7 : నిశ్చితార్థం జరిగిన తర్వాత పెండ్లి చేసుకోవాలంటే అదనపు కట్నం ఇవ్వాలని అమ్మాయి తల్లిదండ్రులను వేధించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేపీహెచ్బీ కాలనీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం సౌదర దిన్నె గ్రామానికి చెందిన యువతి (29) ఈఎన్టీ డాక్టర్గా పనిచేస్తూ..కేపీహెచ్బీ కాలనీలో నివాసముంటున్నది. కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా బేలూరులోని ఓ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్న కర్నూలు జిల్లా ఒవాక్ మండలం కోయిలకుంట్లకు చెందిన దుబ్బ మానోజ్కుమార్ రెడ్డి (30)తో జూన్ 6న నిశ్చితార్థం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె కుటుంబం రూ.50వేలు మనోజ్కుమార్ రెడ్డికి ఇచ్చింది. అలాగే వరకట్నంగా ఐదెకరాల భూమి, రూ.25 లక్షల ప్లాటు, 40 తులాల బంగారం, పెండ్లి ఖర్చులకు రూ.3 లక్షలు ఇవ్వడానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోగా, పెండ్లి పనులకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గతనెల 25న మనోజ్కుమార్ రెడ్డి తల్లిదండ్రులు అమ్మాయి కుటుంబ సభ్యులకు ఫోన్చేసి మా అబ్బాయి పెండ్లి చేసుకోవాలంటే అదనంగా మరో ఐదెకరాల భూమిని ఇవ్వాలని వేధించారు. ఇవ్వకుంటే వివాహం చేసుకోవడం కురదని చెప్పడంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం మనోజ్కుమార్రెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.