సిటీబ్యూరో, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): పెండ్లి పేరుతో యువతులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడిన మాయగాడి నేరాల చిట్ట బయటపడుతున్నది. పోలీస్ కస్టడీలో అతడు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. పెండ్లి చేసుకునేందుకు వివిధ వెబ్సైట్లలో తమ వివరాలను అప్లోడ్ చేసుకుంటున్న యువతులపై గురిపెట్టిన నిందితుడు.. వారితో పరిచయం పెంచుకొని మోసాలకు పాల్పడుతున్నాడు. రూ.లక్షలు గుంజుతున్నాడు. అంతేకాదు.. తనపై కేసు పెడితే లాభంలేదు.. జైలుకు వెళ్తే.. ఒక్కపైసా కూడా రాదు.. అంటూ బాధితులను హెచ్చరిస్తున్నాడు. ఎంతోకొంత ఇచ్చి కేసులు రాజీ కుదుర్చుకుంటున్నాడు.
కాకినాడకు చెందిన పొట్లూరి బాలవంశీకృష్ణ బీఫార్మసీ పూర్తి చేశాడు. కొంతకాలం బెంగళూరులో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ కంపెనీల్లో పనిచేశాడు. అక్కడ ఏర్పడిన పరిచయాలతో సొంతంగా క్యాసినోలో జూదం, ఆన్లైన్ బెట్టింగ్, ఇతర జూదం క్రీడలు ఆడుతూ జల్సాలు చేశాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో అడ్డదారులు తొక్కాడు. మోసాలు మొదలుపెట్టాడు. నిందితుడిపై రాష్ట్ర వ్యాప్తంగా ఏడు కేసులున్నాయి. సికింద్రాబాద్కు చెందిన బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులు 20 రోజుల కిందట నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత నిందితుడిని విచారించేందుకు కోర్టు అనుమతితో సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సికింద్రాబాద్కు చెందిన ఓ యువతి పెండ్లి కోసం షాదీ.కామ్లో తన ప్రొఫైల్ను అప్లోడ్ చేసింది. ఇది చూసిన నేరగాడు తాను సాఫ్ట్వేర్ ఇంజినీర్నంటూ ఆమెను పరిచయం చేసుకున్నాడు. పెండ్లికి ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో బాధితురాలి నుంచి పలు దఫాలుగా రూ. 21.74 లక్షలు వసూలు చేసి, మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఉన్నట్లు గుర్తించారు.
నగరానికి చెందిన మరో యువతిని కూడా రూ.5 లక్షలు మోసం చేశాడు. ఆ తర్వాత రాజీ కుదర్చుకున్నట్లు నిందితుడు వెల్లడించాడు.