బంజారాహిల్స్,సెప్టెంబర్ 8: ఏడేండ్లుగా ప్రేమ పేరుతో యువతిని నమ్మించడంతోపాటు పెండ్లి చేసుకుంటానని లోబర్చుకుని మోసం చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.11లోని సింగాడకుంటలో నివాసముంటున్న గౌతమ్(28) ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తుంటాడు. అదే ప్రాంతంలో ఉంటున్న యువతి(27) ఓ నిర్మాణ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నది. ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించిన గౌతమ్.. పెండ్లి చేసుకుంటానని నమ్మించి.. లోబర్చుకున్నాడు. పలు కారణాలతో వివాహాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చి.. మూడు నెలల కిందట మరో యువతిని పెండ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి బాధితురాలికి కనిపించకుండా ముఖం చాటేశాడు. దీంతో ఆమె ఇంటికి వెళ్లి..అతడిని నిలదీయగా, సమాధానం ఇవ్వకపోగా దురుసుగా ప్రవర్తించాడు. బాధితురాలు బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు.. గౌతమ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.