ముషీరాబాద్, అక్టోబర్ 21: నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు బీఆర్ఎస్ అభ్యర్థి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ విజ్ఞప్తి చేశారు. శనివారం అడిక్మెట్ డివిజన్ విద్యానగర్ బ్రహ్మంగారి టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ సమక్షంలో 200 మంది మహిళలు బీఆర్ఎస్లో చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ… నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వెయ్యి కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. గతంలో పని చేసిన ఎమ్మెల్యే, ఎంపీలు నియోజకవర్గాన్ని ఏనాడు పట్టించుకోలేదని, చుట్టపు చూపుగా వచ్చి వేళ్లేవారన్నారు. నిత్యం జన మధ్య ఉండే వారికే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు నచ్చి అన్ని వర్గాల వారు బీఆర్ఎస్లో చేరడానికి ముందుకువస్తున్నారని అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం ముఠా గోపాల్ నాయకత్వంలో ఘననీయమైన అభివృద్ధి సాధించిందని ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ మహిళా నేతలు అనురాధ, ప్రేమలతారెడ్డి, గీతారెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ముఠా జయసింహ, బి.శ్రీనివాస్రెడ్డి, కె.సురేందర్, రవియాదవ్, శ్యామ్సుందర్, అస్లాం, మాధవ్, కవిత, శైలజ తదితరులు పాల్గొన్నారు.