Crime News | ఖైరతాబాద్, ఫిబ్రవరి 29 : ట్రాన్స్జెండర్ కోసం వెళ్లిన ఓ వ్యక్తి దొంగల చేతికి చిక్కాడు. ఆ దుండగులు అతడిపై దాడి చేసి సెల్ఫోన్ లాక్కెళ్లారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. డీఐ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…నగరంలోని ఎల్లమ్మబండకు చెందిన ధుదాని బహదూర్సింగ్, తిల్పితియా గురుదార్ సింగ్ అలియాస్ గురుదేవ్ సింగ్ పాత నేరస్తులు. అదే ప్రాంతానికి చెందిన మోదీమ్ తుల్జారామ్, వారి స్నేహితులైన చాంద్రాయగుట్టకు చెందిన తేకు నవీన్, సయ్యద్ గౌస్ పాషా, షేక్ అల్తాఫ్ అలియాస్ మస్తాన్తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
దోపిడీ కోసం కత్తులను సైతం కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్దకు ఆటోలో చేరుకున్న ఆ ముఠా.. దారి దోపిడీ కోసం సిద్ధమైంది. ఆ సమయంలో నగరానికి చెందిన నరేశ్ కుమార్ ఎర్రమంజిల్ మాల్ వద్ద ట్రాన్స్జెండర్తో కలిసి ఉండటాన్ని గమనించారు. వెంటనే అక్కడికి చేరుకొని తమ వెంట తెచ్చుకున్న కత్తితో బెదిరించి దాడి చేసి కొట్టారు. అతడిని కిందపడేసి సెల్ఫోన్ను లాక్కొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు. కాగా, నరేశ్ కుమార్ ట్రాన్స్జెండర్ కోసం వెళ్లగా, ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. గురువారం నిందితులను రిమాండ్కు తరలించారు.